హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను కరోనా నేపథ్యంలో వాయిదావేస్తు న్నట్టు ఇంటర్బోర్డు ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదావేశారు. మే 29 నుంచి జూన్ 7వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతానికి భిన్నంగా ముందు థియరీ పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. మే 1 నుంచి 20 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరగనుండగా, అదేనెల 24 నుంచి 28వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ -4 పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు పరీక్షలు ముగియగానే మే 29 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా రెండు ఆదివారాలు కలుపుకొని 10 రోజుల్లో పూర్తిచేసేందుకు షెడ్యూల్ ఖరారుచేశారు. హాల్టికెట్లు, బ్యాచ్లవారీగా టైంటేబుల్ను త్వరలోనే ప్రకటిస్తామని జలీల్ తెలిపారు.