వాషింగ్టన్ : అమెరికాలో 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఔషధ దిగ్గజం ఫైజర్ శుక్రవారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)కు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ 16 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇతర నియంత్రణ సంస్థ నుంచి వ్యాక్సిన్ వినియోగ అనుమతులు పొందేందుకు దరఖాస్తు చేయనున్నట్లు ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్టెక్ కంపెనీలు తెలిపాయి.
రెండు కంపెనీలు ట్రయల్స్ ఫలితాలను ప్రకటించాయి. 12-15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో వ్యాక్సిన్ వందశాతం ప్రభావంతంగా పని చేస్తుందని వెల్లడించాయి. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు నమోదు కాలేదని చెప్పాయి. టీకా వేసినప్పుడు పెద్దలు ఎలాంటి స్వల్ప అస్వస్థతకు గురయ్యారో?.. అంటే జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి చిన్న, చిన్న సమస్యలు తలెత్తాయని అందులోనూ రెండవ సారి టీకా తీసుకున్న సమయంలో ఇలాంటి ఫిర్యాదులు అందుకున్నట్లు తెలిపింది. ఫైజర్-బయోఎన్టెక్ దీర్ఘకాలిక రక్షణ, భద్రత గురించి మరింత సమాచారం కోసం తమ అధ్యయనాన్ని కొనసాగిస్తామని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 12 నుంచి 15 ఏళ్ల వారికి టీకాలు వేయడం ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డేటా ప్రకారం.. అమెరికాలో 90.2 మిలియన్లకుపైగా ఫైజర్-బయో ఎన్టెక్స్ వ్యాక్సిన్ మోతాదులు వేశారు. 80 మిలియన్లు మోడెర్నా, 5 మిలియన్ల జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మోతాదులు వేశారు.