కోదాడ, ఏప్రిల్ 17 : కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు, సహచర విద్యార్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని లేక్ష్య కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు కళాశాలకు వచ్చిన రోజే ఈ ఘటన జరగడం మరింత విషాదాన్ని కలిగించింది. గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.