గుర్గావ్: దేశంలో రెండో వేవ్ కరోనా విజృంభణ కలకలం రేపుతున్నది. పలు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కరోనా టీకాలపై పడింది. దీంతో ప్రజలు టీకాలు వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలు ఉచిత ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానాలోని గుర్గావ్కు చెందిన ఒక రెస్టారెంట్ తాజాగా మందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘కరోనా టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్ పట్టుకెళ్లండి’ అని ప్రకటించింది.
అలాగే టీకాలు వేయించుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ‘ఇండియన్ గ్రిల్ రూమ్తో మీ టీకాను జరుపుకోండి’ అనే కొత్త ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. వ్యాక్సిన్ తీసుకున్న కార్డును చూపితే ఉచితంగా బీర్ సర్వ్ చేస్తామని పేర్కొంది. ఈ నెల 5న ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ వారం వరకు కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో గుర్గావ్ గోల్డ్ రోడ్లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్కు మద్యం ప్రియుల తాకిడి పెరిగింది.
గుజరాత్ రాజ్కోట్ జిల్లాకు చెందిన స్వర్ణకారుల వర్గానికి చెందినవారు ఇటీవల కరోనా టీకా వేయించుకున్న మహిళలకు ముక్కు పుడకలు, పురుషులకు చేతి కడియాలు పంపిణీ చేశారు. అలాగే అదే జిల్లాకు చెందిన జాన్ విజన్ సంస్థ టీకా వేయించుకున్న వారికి ఉచితంగా ఆహారాన్ని అందజేస్తున్నది. టీకా వేయించుకునే వారి కోసం అల్పాహారం, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తద్వారా టీకా కోసం సమయం వెచ్చించే వారు ఇంటికి వెళ్లిన తర్వాత వండుకునే బాధ తప్పుతుందని చెప్పారు.