– ఆర్డీఓ వేణుమాధవ్ రావు
పెన్పహాడ్, ఏప్రిల్ 27 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూర్యాపేట ఆర్డీఓ ఆర్.వేణుమాధవరావు నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం పెన్పహాడ్ మండల కేంద్రంతో పాటు మాచారం, అనాజీపురం, అనంతారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మిల్లుల్లో వెంటనే ధాన్యం దిగుమతులు అయ్యే విధంగా, లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాంటాలో లేడా వస్తే నిర్వాహకులు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు తమ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలన్నారు.
కేంద్రాల్లో గోనె సంచులు, పట్టాలు అందుబాటులో ఉంచి రైతులకు సౌకర్యాలను కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటిని త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించవద్దని, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ జి.రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐ రంజిత్ రెడ్డి, కొనుగోలు పాల్గొన్నారు.