పెబ్బేరు, ఆగస్టు 10 : జిల్లాలో రైసు మిల్లులు అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారాయి. తక్కువ సమయంలో ఆర్థికంగా అందలమెక్కాలంటే రైస్ మిల్లుల ఏర్పాటే సరైన మార్గంగా కొందరు భావిస్తున్నారు. దీం తో విచ్చలవిడిగా మిల్లులు ఏర్పాటవుతున్నాయి. తర్వాత తమ పలుకుబడిని ఉపయోగించి అందినకాడికి దండుకోవడమే పనిగా వారు వ్యవహరిస్తున్నా రు. ప్రభుత్వం మిల్లులకు సరఫరా చేసిన సీఎంఆర్ ధాన్యాన్ని స్వాహా చేయడమే వారు పనిగా పెట్టుకొని కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నారు.
ఇటీవల పెబ్బేరు, శ్రీరంగాపు రం మండలాల్లో రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన తనిఖీల్లో పెద్ద ఎత్తున ధాన్యం మాయం అయినట్లు వెలుగు చూసింది. కేవలం రెండు రైస్ మిల్లుల్లోనే రూ.46 కోట్ల అవినీతి జరిగిందని తేలిందంటే జిల్లాలోని మిగితా రైస్ మిల్లుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం విషయంలో మొదటి నుంచి కొందరు రైస్ మిల్లుల యజమానులు పరిధి దాటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులకు తాయిలాలు ఆశ చూపడం, రాజకీయ పలుకుబడి ఉపయోగించడం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో పెబ్బేరులోని సాయిగోపాల ఇండోటెక్ రైస్ మిల్లులో 2022-23 యాసంగికి కేటాయించిన ధాన్యంలో 1.17 లక్షల బస్తాలు మాయమైనట్లు తేలింది. ఈ ధాన్యం విలువ జరిమానాతో కలిపి రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే, శ్రీరంగాపురంలోని ఆల్ అజీజ్ బియ్యం మిల్లులో జరిపిన తనిఖీల్లో 2.20 లక్షల ధాన్యం బస్తాలు కనిపించలేదు. వీటి విలువ జరిమానాతో కలిపి రూ.31 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ రెండు మిల్లులకు సంబంధించి రూ.46 కోట్ల ధాన్యం కుంభకోణం జరిగినట్లు రూఢీ అయింది.
దీంతో జిల్లా వ్యవసాయశాఖాధికారి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ఈ రెండు మిల్లులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పెబ్బేరు మిల్లుకు సంబంధించిన యజమాని హరినాథ్ పరారీలో ఉండగా.. శ్రీరంగాపురం మిల్లు యజమాని సయ్యద్ వహీద్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను పరిశీలిస్తే వనపర్తి జిల్లాలోనే సీఎంఆర్ అక్రమాలు ఎక్కువగా జరిగాయని అధికారుల తనిఖీల్లో బయటపడింది.