జైపూర్: రాజస్థాన్కు చెందిన ఒక రైతు తన దగ్గరున్న ఐదు లక్షల రూపాయల పొదుపు సొమ్ము దొంగల బారిన పడకుండా కాపాడుకునేందుకు తన పొలంలో పాతిపెట్టి దాచుకున్నాడు. ఏడాది క్రితం అతనికి చెందిన భూమిని విక్రయించగా వచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించుకోవాలనుకున్నాడు. అయితే ఆ నగదు చోరీ అవుతుందనే భయంతో ఒక పాలిథన్ కవర్లో పెట్టి, తన పొలంలో గుంత తవ్వి దానిలో దాచిపెట్టాడు. అయితే అతనికున్న మద్యం అలవాటు, మతిమరపు కారణంగా డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో మరచిపోయాడు. అయినప్పటికీ చాలా చోట్ల తవ్వి చూశాడు. డబ్బు దొరకకపోవడంతో భార్యకు, కుమారులకు విషయం చెప్పాడు. దీంతో వారంతా ఆ నగదు కోసం పొలంలో పలు చోట్ల తవ్వారు. అయినా ఫలితం లేకపోయింది.
ఏడాది తర్వాత వర్షాకాలంలో విత్తనాలు విత్తేందుకు ఆ కుటుంబ సభ్యులు పొలాన్ని చదును చేస్తుండగా, వారికి నగదు ఉన్న పాలిథిన్ కవర్ దొరికింది. దానిని తెరచి చూసి నివ్వెరపోయారు. ఏడాది క్రితం ఇంటిపెద్ద దాచిన డబ్బు అదేనని గుర్తించారు. అయితే ఆ డబ్బును అప్పటికే చెద పురుగులు నాశనం చేశాయి. మిగిలిన్న కొన్ని నోట్ల ముక్కలనైనా కాపాడుకునేందుకు వారు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచిని సంప్రదించారు. అయితే ఆ నోట్ల పరిస్థితి చూసిన బ్యాంకు సిబ్బంది వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. తరువాత వారు జిల్లా ఎస్బీఐ ప్రధాన శాఖకు వెళ్లినా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది.