పెద్దపల్లి, ఏప్రిల్ 22: ఆచరణ సాధ్యంకాని హామీలు, మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని, ఎక్కడికక్కడ నిలదీయాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీల మోసంపై పోస్టు కార్డు ఉద్యమం చేపట్టామని, ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తూ సోమవారం 5వేల పోస్టులు ముఖ్యమంత్రికి పంపామని పేర్కొన్నారు. నేటి నుంచి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లోని గ్రామ గ్రామాన పోస్టు కార్డు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, ఆయన మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మాటిచ్చి మోసం చేసిన రేవంత్ సర్కారును నిలదీయాలని సూచించారు. రైతు బంధు అందరికీ ఎందుకు ఇవ్వలేదో? రూ.2లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదో..? రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు దేవుళ్లు కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని, గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గంట రాములు, బండారి స్రవంతి శ్రీనివా స్, దాసరి ఉష, రాజ్కుమార్, మార్కు లక్ష్మణ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.