నేరేడుచర్ల, మే 5 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల గ్రామంలో అదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించలేక చతికిలబడ్డారని, సాగు నీరు ఇవ్వలేక పొలాలను ఎండబెట్టారని అన్నారు. గతంలో సాగర్లో 508, 510 అడుగుల నీటిమట్టం ఉన్నా పంటలకు నీటిని విడుదల చేసి రైతన్నలకు అండగా నిలిచామని తెలిపారు.
హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా సాగర్లో 515 అడుగులకు పైగా నీరు ఉన్నా పొలాలకు నీటిని విడుదల చేయలేదన్నారు. కాంగ్రెస్ 70 ఏండ్ల నుంచి కూడా రైతుల మీద కపట ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తొమ్మిదేండ్ల పాటు గృహాలకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు 5 సంవత్సరాలు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను అందించి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. చేతకాని కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని, గతంలో ఉన్న విద్యుత్ ఇప్పుడు ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేతగానితనం, పైసలు ఖర్చు చేయకుండా విద్యుత్ కోతలు సృష్టిస్తున్నారని అన్నారు.
మంత్రులు పాల్గొన్న సమావేశాల్లోనే విద్యుత్ కోతలు ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. గ్రామాలకు వెళ్తే ప్రజలే కాంగ్రెస్ లోపాల గురించి వివరిస్తున్నారని, నాలుగు నెలల్లోనే వారి పాలన గురించి అర్థమైందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎంత బుకాయించాలని చూసినా ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని విమర్శించారు. స్వయానా వ్యవసాయ శాఖ మంత్రే ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు ఇవ్వాలి.. ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేమని చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏదీ సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు.
రూ.2లక్షల రుణమాఫీ, 4వేల పింఛన్, ఉచిత విద్యుత్, వడ్లకు రూ.500 బోనస్, మహిళలకు రూ.2500 ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం దేవుడికి ఎరుక.. కనీసం రూ.లక్ష కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులకు చేతకాక పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని, అయినా భయపడేది లేదని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉంది.. కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో సాగర్ ఆయకట్టు రైతులకు అర్థ్ధమైందన్నారు.
అలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఆయకట్టు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హుజూర్నగర్, సాగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు మంచి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్లమెంటు ఎన్నికల సమన్యయ కమిటీ ఇన్చార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్బాబు, నాయకులు చన్నబోయిన సైదులు, చందమళ్ల జయబాబు, పంగ శ్రీను, రాపోలు నవీన్, యల్లబోయిన లింగయ్య, సైదులు, నాగరాజు, వెంకటేశ్వర్లు, శ్రీను, అంజమ్మ పాల్గొన్నారు.