సిటీబ్యూరో, మే 5 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్కు ‘మహానగర’ టెన్షన్ పట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకుండా ఘోర పరాజయం పాలైంది. బీఆర్ఎస్ విజయ దుందుభి ముందు కాంగ్రెస్ చతికిలపడింది. హస్తం రాజకీయ ఉద్దండులు సైతం ఓటమి పాలయ్యారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నా.. ఆ పరిధిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే సీటును కూడా కాపాడుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల పోరులోనూ ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నది. ఎలాగైనా.. ఒక్క లోక్సభ స్థానానైనా గెలవాలని కాంగ్రెస్ నాయకులు సర్వం ఒడ్డుతున్నారు.
అందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నగరవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. కానీ, ఈ సభలకు జనం నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. పదేండ్ల నగరాభివృద్ధితో కేసీఆర్ పాలన నగరవాసుల్లో నిక్షిప్తమై ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు జంకుతున్నారు. గ్రేటర్లో 24 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడమే ఇందుకు నిదర్శనం. బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. అయితే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా ఎంత హంగామా చేసినా… గ్రేటర్కు వచ్చేసరికి మాత్రం చావుదెబ్బ మరోసారి తప్పదేమోననే భయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
కేసీఆర్ పాలనలో కొత్తకొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నేరాల సంఖ్య తగ్గడం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఉపాధి అవకాశాలు, భిన్న సంస్కృతులు, గృహ వసతులు, వినియోగదారులకు అవసరమైన ఏ సామగ్రి అయినా అందుబాటులో దొరకడం.. ఇలా ఎన్నెన్నో… సాధ్యం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్ విశ్వనగరంగా పరుగులు తీసింది. ప్రపంచంలో అతిగొప్ప నగరాల్లో హైదరాబాద్ది ప్రత్యేక స్థానంగా మలిచారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రపంచ స్థాయి కంపెనీలు కొలువుదీరాయి.
ఐటీ రంగంలో ఎగుమతులు మొదలు.. ఉద్యోగాల కల్పన వరకు బెంగళూరును దాటి.. హైదరాబాద్ వృద్ధి రేటును నమోదు చేసింది. మరోవైపు పదేండ్లలో వేల కోట్లతో కల్పించిన అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు హైదరాబాద్ ముఖచిత్రాన్నే మార్చాయి. నగరానికి వచ్చిన ప్రముఖులు నగరాభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. గ్రేటర్ హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలో ప్రశాంతంగా ఉండటం అందరినీ ఆకర్షించింది. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన సైతం జరగలేదంటే.. శాంతిభద్రతలు ఎంత పకడ్బందీగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రశాంత వాతావరణంలో ఇదే అభివృద్ధి కొనసాగాలని గ్రేటర్వాసులంతా కోరుకుని బీఆర్ఎస్ను కడుపున పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే లీడర్షిప్ కోసం లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించేందుకు నగర ఓటర్లు ఆ పార్టీకి జై కొడుతుండటం విశేషం. ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న కాంగ్రెస్, బీజేపీలు.. మహానగరంలో ప్రచారం అంటేనే జంకుతున్నాయి. అందుకే బీఆర్ఎస్ నుంచి నాయకులను లాక్కొని.. తమ పార్టీ అభ్యర్థులుగా నిల్చొబెట్టారని రాజకీయ నిపుణులు సైతం విమర్శిస్తున్నారు.