కురవి, ఆగస్టు 13 : ప్రమాదవశాత్తు కుంటలో పడి మండలంలోని పిల్లిగుండ్లతండాకు చెందిన తల్లీ కొడుకు మృతి చెందిన ఘటన మొగిలిచర్ల శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తండాకు చెందిన నవ్య (26) తన భర్త అశోక్ హైదరాబాద్కు వెళ్లడంతో జ్వరంతో ఉన్న తన కొడుకు అన్వేశ్ (9)ను తీసుకొని పశువులను మేపేందుకు వెళ్లింది. ఈ క్రమంలో కొడుకు బహిర్భూమికి వెళ్లి రెడ్డికుంటలో పడిపోగా అతడిని కాపాడేందుకు తల్లి కూడా దిగి మునిగిపోయింది.
పశువులను మేపేందుకు వెళ్లిన వారు ఎంతకూ రాకపోవడంతో మామ బగారియా, అత్త బుల్లి తమ కోడలు నవ్యకు ఫోన్ చేసినప్పటికీ ఎత్తకపోవడంతో తండావాసులతో కలిసి రెడ్డికుంట వద్దకు వెళ్లి ఫోన్ చేయగా కుంట ఒడ్డునున్న ఫోన్ రింగ్ కావడంతో అక్కడికి వెళ్లి చూడగా మనుమడి బట్టలు కూడా ఉన్నాయి. దీంతో తండావాసులు ముందు గా నవ్య, ఆ తర్వాత అన్వేశ్ మృతదేహాలను బయటకు తీశారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.