హుస్నాబాద్, ఆగస్టు 13: గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేయకుంటే ప్రజాయుద్ధం చేయక తప్పదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ప్రభుతాన్ని హెచ్చరించారు. ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించామని, ఇప్పటికైనా గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
గౌరవెల్లి భూనిర్వాసితులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదన్నారు. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ నిర్వాసితుల పరిహారం చెల్లించకుంటే సెప్టెంబర్ నెలాఖరులో నిర్వాసితులతో కలిసి ఉద్యమిస్తామని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్ను హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, ప్రజలను చైతన్యం చేసి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా ఉద్యమాలు చేస్తామన్నారు. అంతకుముందు కార్యకర్తలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్రావు, జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్, నాయకులు సత్యనారాయణ, పల్లె నర్సింహ, శంకర్ పాల్గొన్నారు.