ముంబై : మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన సమయంలో పిడుగుపడడంతో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు మైనర్లకు గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకున్నది. తహసీల్దార్ రాహుల్ సారంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం దహను తాలూకాలోని మంకర్పాడ వద్ద నలుగురు పిల్లలు పశువులను మేపేందుకు వెళ్లారు. జిల్లాలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం నలుగురు పిల్లలు కలిసి చెట్టెక్కారు. ఈ సమయంలో ఒక్కసారి చెట్టపై పిడుగు వేయడంతో రవీంద్ర కోర్డా (15) అనే బాలుడు మృతి చెందాడు. 14-16 సంవత్సరాల మధ్య ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని కాసా గ్రామీణ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. రవీంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.