మన మెదడులో కోట్లకొద్దీ నాడీకణాలు ఉంటాయి. ప్రతి నాడీ కణం మరో నాడీకణంతో అనుసంధానమై ఉంటుంది. ఈ నాడీకణాలన్నీ వెన్నుపూసకు కనెక్ట్ అయి ఉంటాయి. మెదడు నుంచి వెన్నుపూసకు కలపబడిన నర్వ్సెల్స్ సమూహాన్నే ‘కేంద్ర నాడీ వ్యవస్థ’ (సెంట్రల్ నర్వ్ సిస్టమ్) అంటారు. వెన్నుపూస నుంచికూడా శరీరంలోని ప్రతి భాగానికీ నాడీకణాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ నాడీ వ్యవస్థను ‘పరిధీయ నాడీ వ్యవస్థ’ (పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్) అంటారు. డిమైలినేషన్ అనే వ్యాధి నేరుగా నరాలపై ప్రభావం చూపుతుంది. ఇది మెదడు లేదా వెన్నుపూసకు సంబంధించిన నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తే ‘సెంట్రల్ నర్వ్ డిమైలినేషన్’ అంటారు. వెన్నెముక నుంచి కాళ్లు, చేతులు తదితర అవయవాల నాడీ వ్యవస్థను దెబ్బతీస్తే ‘పెరిఫెరల్ నర్వ్ డిమైలినేషన్’ అంటారు.
డిమైలినేషన్ అంటే?
సాధారణంగా నరాలు వేరు. రక్తనాళాలు వేరు. శరీరంపై మనకు కనిపించేవి రక్తనాళాలు. చాలామంది వాటినే నరాలుగా అపోహ పడతారు. నరాలు అనేవి కండరాల మధ్యలో ఉంటాయి. ‘మైలిన్’ అనే పొర వాటిని కప్పిపెట్టి ఉంచుతుంది. అందువల్ల బయటికి కనిపించవు. కరెంటు వైరులో రాగి తీగపై రబ్బరు తొడుగులా అన్నమాట! నరాలపై ఉండే మైలిన్ దెబ్బ తినడాన్నే ‘డిమైలినేషన్’గా వ్యవహరిస్తారు. మెదడులోని నరాలమీది మైలిన్ దెబ్బ తింటే ఆ రోగి ‘బ్రెయిన్ డిమైలినేషన్’ బారిన పడినట్టు. దీన్నే ‘సెంట్రల్ నర్వ్ డిమైలినేషన్’ అని అంటారు. అలా కాకుండా అవయవాలకు సంబంధించిన నరాలమీది మైలిన్ దెబ్బ తింటే ‘పెరిఫెరల్ నర్వ్ డిమైలినేషన్’తో ఇబ్బంది పడుతున్నట్టు. సెంట్రల్ నర్వ్ డిమైలినేషన్లో మూడు దశలు.
1) మల్టిపుల్ స్క్లిరోసిస్ (ఎంఎస్),
2) ఎక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సఫిలో మైలైటిస్ (ఏడీఈఎం),
3) న్యూరోమైలైటిస్ ఆప్టికా (ఎన్ఎంఓ).
మల్టిపుల్ స్క్లిరోసిస్ (ఎంఎస్):
ఇది ఎక్కువమందిలో కనిపించే రుగ్మత. గతంలో విదేశాలలో మాత్రమే ఉందని భావించే వాళ్ళం. కానీ, మన దేశంలోకూడా చాలామందిలో ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. సాధారణంగా 15 నుంచి 50 ఏండ్ల మధ్య యువతులు, మహిళల్లో వస్తుంది. 50 ఏండ్ల తరువాత వ్యాధి రావడం అరుదు. పురుషుల్లో తక్కువే. సాధారణంగా ఎంఎస్లో ఒక ఎటాక్ వచ్చి రికవరీ అయిన తర్వాత, అంటే… కంట్లో వాపు రావడం లేదా చూపు మందగించడం జరిగి, చికిత్సతో కోలుకున్న కొంతకాలానికి మరో అవయవం దెబ్బతింటుంది. కాలు లేదా చేతికి అనుసంధానమైన బ్రెయిన్లోని నర్వ్ సెల్పై డిమైలినేషన్ ఏర్పడుతుంది. కొన్ని రోజుల తర్వాత రోగి కోలుకుంటారు. కొన్నిసార్లు ఎలాంటి చికిత్స లేకుండానే సమస్యనుంచి బయటపడతారు. కానీ, మళ్లీ వచ్చే ఆస్కారం లేకపోలేదు. ఇలా తరచూ వచ్చేదాన్ని ‘రిలాప్సింగ్ రెమిటింగ్ మల్టిపుల్ స్క్లిరోసిస్’ (ఆర్ఆర్ఎంఎస్) అంటారు. ఈ వ్యాధిని ముందుగా కొన్ని ప్రత్యేక లక్షణాల ఆధారంగా గుర్తిస్తారు. ఆ తరువాత ఎంఆర్ఐ లేదా ‘సెర్లో స్పైనల్ ఫ్లూయిడ్’ (సీఎస్ఎఫ్- వెన్నుపూసలోనుంచి నీరు తీయడం) వంటి వైద్యపరీక్షలతో నిర్ధారిస్తారు. ఎంఆర్ఐ ద్వారా అయితే సమీప భవిష్యత్తులో మళ్లీ ఏ అవయవం డిమైలినేషన్కు గురవుతుందో కూడా అంచనా వేయవచ్చు. సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే తీవ్రతను తగ్గించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకమే. మరింత ముదురుతుంది. దీన్నే ‘సెకండరీ ప్రోగ్రెసివ్ ఎంఎస్’ (ఎస్పీఎంఎస్) అంటారు. సమస్య ఇంతవరకూ వస్తే చికిత్స చాలా కష్టం.
ఎక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సఫిలో మైలైటిస్ (ఏడీఈఎం):
ఇది మెదడులోగాని, వెన్నుపూసలో గాని హఠాత్తుగా వస్తుంది. మిగిలిన వ్యవస్థలమీదా దాడి చేయవచ్చు. చిన్నపిల్లలే ప్రధాన బాధితులు. తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంఆర్ఐతో గుర్తించవచ్చు. సకాలంలో చికిత్స చేస్తే మందులతో నయమవుతుంది. గతంలో అయితే ఈ వ్యాధి ఎందుకు వస్తుందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు కొంతమందిలో మాగ్ యాంటీబాడీ వల్ల రావచ్చని తెలుస్తున్నది.
న్యూరోమైలైటిస్ ఆప్టికా(ఎన్ఎంఓ):
గతంలో ఈ వ్యాధినికూడా మల్టిపుల్ స్క్లిరోసిస్ గానే భావించేవారు. 2004లో ఈ వ్యాధికి కారణమైన యాంటీబాడీని గుర్తించారు. కన్ను, వెన్ను, మెదడు ఈ వ్యాధివల్ల ప్రభావితమవుతాయి. నిన్నమొన్నటి వరకూ అరుదుగా కనిపించేది. ఈమధ్య కేసులు పెరుగుతున్నాయి.
పెరిఫెరల్ నర్వ్ డిమైలినేషన్:
ఇందులో రెండు రకాల వ్యాధులు ఉన్నాయి.
ఎక్యూట్ ఇమ్యున్మీడియేట్ డిమైలినేషన్ (ఏఐడీపీ):
వెన్నెముకనుంచి కాళ్లు, చేతులు వంటి వివిధ అవయవాలకు అనుసంధానమైన నరాలపై డిమైలినేషన్ ఏర్పడటం వల్ల ఏఐడీపీ వస్తుంది. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో ఈ రుగ్మతను కనుగొన్నారు. దీనిని ‘గిలన్బ్యారో సిండ్రోమ్’ (జీబీఎస్) అనీ వ్యవహరిస్తారు. సాధారణంగా ఏఐడీపీ ఒకసారి వచ్చి తగ్గిపోతుంది. నాలుగు వారాల తరువాత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. రెండోసారి వచ్చే ఆస్కారం తక్కువ. మొదటి రెండు వారాల్లో పెరుగుతూ ఉంటే దీనికి ప్లాస్మా ఫెరిసిస్తో చికిత్స చేస్తారు. అంటే, డయాలసిస్లా రక్త శుద్ధి చేస్తారు. లేదా ఐవీఐజీ ద్వారాకూడా చికిత్స అందిస్తారు. ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. శ్వాస వ్యవస్థ దెబ్బతింటే వెంటిలేటర్పై చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు చిన్నచిన్న నరాలు ప్రభావితం కావడం వల్ల రక్తపోటుపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. అలాంటి సందర్భాల్లో ప్రాణహాని ఉంటుంది. ఇప్పుడు కరోనా సమయంలో, కొంత మందిలో కొవిడ్ వచ్చి తగ్గిన తరువాత ఏఐడీపీ కనిపిస్తున్నది.
లక్షణాలు:
తిమ్మిర్లు రావడం.
కాళ్లూ చేతులు పడి పోవడం.
నడవలేక పోవడం.
ఊపిరి తీసుకోలేక పోవడం.
క్రానిక్ ఇమ్యునో డిమైలినేటింగ్ పాలిన్యూరోపతి (సీఐడీపీ):
నెమ్మదిగా వస్తుంది. క్రమంగా నరాలు దెబ్బతింటాయి. సమస్య తీవ్రమై బ్యాలెన్స్ తప్పుతుంది. సెన్సేషన్ తగ్గుతుంది. రోగి బలహీనంగా మారిపోతాడు. కుప్పకూలి పోతాడు. ప్రతి నెలా ఐవీఐజీ ఇస్తూ వ్యాధిని నియంత్రించవచ్చు. ఇది ఖరీదైన చికిత్స. ఇది కాకుండా ట్యాబ్లెట్లుకూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, దీర్ఘకాలం పాటు వాడాల్సి ఉంటుంది. అరుదైన సందర్భాలలో వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. కొన్నిసార్లు క్రమంగా పెరుగుతూ పోతుంది. ట్రీట్మెంట్తో రుగ్మతను నియంత్రించవచ్చు. కానీ, పూర్తిగా అరికట్టడం అరుదు. ఇది జీవితాంతం ఉండే దీర్ఘకాలిక జబ్బు. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ తప్పనిసరి. ఫిజియోథెరపీ, ఐవీఐజీతోపాటు ఇతర మందులు అందుబాటులో ఉంటాయి కాబట్టి, భయపడాల్సిన అవసరం లేదు.
చికిత్సా విధానం
వ్యాధిని ఎంత త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే అంత త్వరగా రోగి కోలుకుంటాడు. ఎంఎస్గాని, ఆర్ఆర్ఎంస్గాని స్వల్పంగా ఉంటే తక్కువ శక్తిగల మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని మందులవల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఆ చెడు ప్రభావాన్ని నామమాత్రం చేసే ఔషధాలూ అందుబాటులో ఉన్నాయి.
సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ఇంజక్షన్స్కూడా వచ్చాయి. స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ కూడా జీవితకాలం సమర్థంగా పనిచేస్తుంది.
కారణాలు
ఏవైనా ఇన్ఫెక్షన్లు ఒంట్లోకి ప్రవేశించినప్పుడు మన వ్యాధి నిరోధకత వాటితో పోరాడుతుంది. ఈ క్రమంలో కొన్ని యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంపై దండెత్తిన ఇన్ఫెక్షన్స్ను అడ్డుకుంటాయి. కానీ, కొన్నిసార్లు మన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీసే మన శరీరంపై తిరుగుబాటుకు తెగబడతాయి. అంటే, మన ఇమ్యూన్ సిస్టమే మనపై దాడి చేస్తుంది. ‘కంచే చేను మేసినట్టు’ అన్నమాట! ఈ క్రమంలో ఇమ్యూన్ సెల్స్ నరాలపై ఉన్న మైలిన్మీద దాడి చేసినప్పుడు డిమైలినేషన్ ఏర్పడుతుంది. ఆ దాడి సెంట్రల్ నర్వ్ సిస్టమ్మీద కావచ్చు, పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్మీదా కావచ్చు.
నష్టాలు
తీగద్వారా విద్యుత్ ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఎలా సరఫరా అవుతుందో, అలానే మన శరీరంలోని నరాలద్వారా బ్రెయిన్నుంచి అవయవాలకు, అవయవాల నుంచి బ్రెయిన్కు సమాచార మార్పిడి జరుగుతుంది. కరెంటు తీగమీదున్న రబ్బరు తొడుగు తొలగిపోతే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్టే, నరంపై ఉన్న మైలిన్ దెబ్బ తిన్నప్పుడూ శరీరంలోని అవయవాలనుంచి బ్రెయిన్కు, బ్రెయిన్నుంచి అవయవాలకు సమాచారం వెళ్లదు. ఫలితంగా సదరు అవయవాలు నెమ్మదిస్తాయి లేదా పనిచేయడం మానేస్తాయి.
ప్రాథమిక లక్షణాలు:
చూపు మందగించడం.
ఒక కాలు, చేయి బలహీన పడటం, పాక్షికంగా స్పర్శ తెలియక పోవడం.
నడకలో సమతౌల్యం లోపించడం, కింద పడిపోవటం.
మూత్ర విసర్జనమీద పట్టు లేకపోవడం.