బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి కుమారస్వామి రూ. 10 కోట్లు తీసుకున్నారని అహ్మద్ ఆరోపించారు.
ఆ తర్వాత బసవకల్యాణ్ నియోజకవర్గానికి జేడీఎస్ అభ్యర్థిని బరిలో దింపారని పేర్కొన్నారు.
బసవకల్యాణ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ నారాయణ్ రావు కరోనా కారణంగా గతేడాది సెప్టెంబర్ నెలలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
అయితే ఈ ఉప ఎన్నికలో జేడీఎస్ పోటీ చేయదని ఇటీవలే ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. కానీ అంతలోనే జేడీఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీతో రూ. 10 కోట్లు తీసుకొని జేడీఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఓటు బ్యాంకును చీల్చేందుకే కుమారస్వామి కుట్ర చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తమ వద్ద సరిపడ నగదు లేదని దేవేగౌడ ప్రకటించారు. అందుకే ఈ ఎన్నికల్లో బరిలో ఉండట్లేదని తెలిపారు. కానీ ఇప్పుడు కుమారస్వామి మైనార్టీ అభ్యర్థిని పోటీలో ఉంచారు. బీజేపీ ఏజెంట్గా కుమారస్వామి వ్యవహరిస్తున్నారని జమీర్ మండిపడ్డారు.
బసవకల్యాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కాంగ్రెస్ నుంచి నారాయణ్ రావు సతీమణి మల్లమ్మ, బీజేపీ నుంచి శరణు సల్గార్, జేడీఎస్ నుంచి సయీద్ యాస్రాబ్ అలీ ఖాద్రీ పోటీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..