టెహ్రాన్: ఇరాన్లో భారీ పేలుడు ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియోను డోనాల్డ్ ట్రంప్ షేర్ చేశారు. ట్రుత్ సోషల్లో ఆయన ఆ వీడియోను పోస్టు చేశారు. ఇరాన్లోని రెండో అతిపెద్ద నగరమైన ఇస్ఫాహన్లో ఆ భారీ పేలుడు జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది. వరుస పేలుళ్లు జరిగినట్లు వీడియో ఫూటేజ్ ద్వారా తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆకాశాన్ని అంటే రీతిలో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. రాత్రి చీకట్లో ఆకాశం అంతా ఆరెంజ్ రంగుగా మారింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వీడియోకు ఎటువంటి కామెంట్ చేయలేదు.
ఇస్ఫాహన్ నగరంలో ఉన్న అతిపెద్ద అమ్యూనిషన్ డిపోపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ సిటీలో సుమారు 23 లక్షల జనాభా ఉంటుంది. బదర్ మిలిటరీ ఎయిర్బేస్ కూడా ఈ సిటీలోనే ఉంది. అయితే సుమారు రెండు వేల పౌండ్ల బరువున్న అంటే సుమారు 907 కేజీల బరువున్న బంకర్ బస్టర్ బాంబులతో ఆ ఆయుధ డిపోను పేల్చివేసినట్లు అమెరికాకు చెందిన ద వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. భారీ మొత్తంలో బంకర్ బస్టర్ బాంబులు లేదా పెనట్రేటర్ మునిషన్స్ వాడి ఉంటారని ఓ ఆర్మీ అధికారి తెలిపారు.
వైమానిక దాడి తర్వాత.. చాలా శక్తివంతమైన వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆ ఏరియా మొత్తం ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. తాజా దాడితో ఇరాన్ వార్ మరింత భీకరంగా మారే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించింది. మరోవైపు పాక్, ఈజిప్ట్, సౌదీ, టర్కీ దేశాలు దౌత్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
కొన్ని నివేదికల ప్రకారం.. ఇటీవల ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం స్టాక్ను ఇస్ఫాహన్ నగరానికి రహస్యంగా తరలించి ఉంటుందని భావిస్తున్నారు. సుమారు 540 కేజీల శుద్దీకరించిన యురేనియంను ఆ నగరానికి తీసుకెళ్లినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నగరంలో ఉన్న అండర్గ్రౌండ్ కేంద్రానికి తరలించినట్లు భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ సమయంలోనూ ఈ నగరాన్ని అమెరికా టార్గెట్ చేసింది. ఒకవేళ డీల్ కుదరకుంటే ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలను, వాటర్ ప్లాంట్లను పేల్చివేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే తాజా పేలుడు ఘటన జరిగింది.