(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్ పిడుగు వేయనున్నది. పశ్చిమాసియా ఉద్రిక్తతలను సాకుగా చూపుతూ ఇండ్లల్లో వినియోగించే 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్పై రూ. 18 మేర వాత పెట్టనున్నది.
ఈ మేరకు కొత్త సెస్ను తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు అంతర్జాతీయ పత్రిక ‘ది రాయిటర్స్’ ఓ కథనంలో వెల్లడించింది. నేచురల్ గ్యాస్పై కూడా క్యూబిక్ మీటర్కు రూ. 1.43 మేర సెస్ విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు పత్రిక వివరించింది.
ఈ రెండు సెస్ల ద్వారా కేంద్రానికి ఏటా సుమారు రూ. 4.3 వేల కోట్లు సమకూరే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రానున్న పదేండ్లలో రూ.3.9 లక్షల కోట్ల వ్యయంతో వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేయడంలో భాగంగా కేంద్రం ఈ సెస్ నిర్ణయం తీసుకోనున్నట్టు పత్రిక అభిప్రాయపడింది. అయితే, ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుల నుంచి సెస్ల పేరిట కేంద్రం బలవంతపు వసూళ్లకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి.
2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధరలు 140 శాతం మేర పెరగ్గా, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు 76.4 శాతం మేర ఎగబాకాయి. గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచబోమని ఎన్నికల ముందు హామీలనిచ్చి.. ఫలితాలు రాగానే మాటమార్చడం బీజేపీకి రివాజుగా మారిందని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.
