న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. అలాగే మరణాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. 54 రోజుల తర్వాత రోజువారీ కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కొత్తగా 2,55,287 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 2,795 మంది వైరస్ బారినపడి మృతి చెందారని ఆరోగ్యశాఖ చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కు చేరింది. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 2,59,47,629 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం 3,31,895 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉండగా.. చాలా రోజుల తర్వాత దేశంలో యాక్టివ్ కేసులు 20లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం దేశంలో 18,95,520 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.09శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.64 శాతంగా ఉందని.. రోజువారీ పాజిటివిటీ రేటు 6.62శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. టీకా డ్రైవ్లో 21,60,46,638 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. నిన్న ఒకే రోజు 19,25,374 కొవిడ్ శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఈ నెల 31వ తేదీ వరకు మొత్తం 34,67,92,257 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.