పారిస్ : జపాన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకా షాక్ ఇచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఫ్రెంచ్ ఓపెన్లో మొదటి రౌండ్లో విజయం అనంతరం వీడియా సమావేశానికి హాజరుకాకపోవడంతో రిఫరీ 15వేల డాలర్లు జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్యతో పాటు మరో మూడు గ్రాండ్స్లామ్ టోర్నీ నిర్వాహకులు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఆమె ఇలాగే మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలనుకుంటే తనపై కఠినమైన జరిమానాలు విధించడంతో పాటు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రకటనలో తెలిపారు.
ఈ క్రమంలోనే టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. గత కొంతకాలంగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నట్లు, అందుకే తప్పుకుంటున్నట్లు పేర్కొంది. ముందే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం టోర్నమెంట్కు, ఇతర క్రీడాకారులకు, నా శ్రేయోభిలాషులకు మంచిదని భావిస్తున్నానని పేర్కొంది. 2018 యూఎస్ ఓపెన్ నుంచి నేను మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నానని, దాని నుంచి బయటపడేందుకు చాలా కష్టపడానని చెప్పింది. పారిస్ టోర్నమెంట్లో కూడా ఆందోళనగా ఉన్నానని, అందుకు స్వీయ సంరక్షణ చర్యలు తీసుకోవడానికే మీడియా సమావేశాన్ని నిరాకరించానని చెప్పింది.
నేను సహజంగా పబ్లిక్ స్పీకర్ను కానని, ప్రపంచ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతానని పేర్కొంది. నేనెప్పుడు పరధ్యానంగా ఉండాలని అనుకోలేదని, ప్రస్తుతం నా సమయం సరిగా లేదని, ఆటలో నిబంధనలు పాతవైపోయాయని, అందుకే ముందుగానే వైదొలుగున్నట్లు ప్రకటించానని ఒసాకా ట్వీట్ చేసింది. ఇతర క్రీడాకారులు ఆటపై దృష్టి పెట్టాలని, తిరిగి పుంజుకోవాలని సూచించారు. కాగా, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా మీడియాతో మాట్లాడనని ఒసాకా చెప్పిన సంగతి తెలిసిందే.