అమీన్పూర్ (జిన్నారం), ఆగస్టు 3: సుమారు ఇరవై ఏండ్లుగా నమ్మకంగా ఉండి చిట్టీలు నడిపిన ఆ దంపతులు, ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి పరారయ్యారు. బాధితులు, సీఐ ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, రాయిని శిరీష దంపతులు 20 ఏండ్లుగా సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్లోని బీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉన్నారు. ఈ దంపతులు కాలనీలో బట్టల వ్యాపారం చేయడంతో పాటు చిట్టీలు వేస్తూ ప్రజలతో నమ్మకంగా వ్యవహరించారు. ప్రజలు నమ్మడంతో లక్షల రూపాయల్లో చిట్టీలు వేయడం ప్రారంభించారు. రెండేండ్లుగా రూ.2.50కోట్ల విలువైన చిట్టీలు వేయడం ప్రారంభించారు.
మరి కొంతమంది వద్ద వడ్డీలకు డబ్బులు తీసుకున్నారు. మూడు నెలలుగా చిట్టీలు వేసినవారికి డబ్బులివ్వడం ఆలస్యం అవుతున్నది. దీంతో పలుమార్లు ఆ దంపతులను చిట్టీ వేసిన వారు, అప్పులు ఇచ్చిన వారు ప్రశ్నించారు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించిన ఆ దంపతులు, సొంత ఇంటిని ఎవరికీ తెలియకుండా విక్రయించారు. రెండు రోజుల క్రితం సాంబశివరావు, శిరీష ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో తాము నష్టపోయామని భావించిన కాలనీకి చెందిన 25 మందికి పైగా బాధితులు అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న భార్యాభర్తలను గాలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సీఐ ప్రవీణ్రెడ్డి తెలిపారు.