హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ‘దేశవ్యాప్తంగా సమాజంలో ఒక సరికొత్త వైఖరి, మార్పు ప్రారంభమైంది. అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఎక్స్ వేదికగా శనివారం ఆయన పెట్టిన ఆసక్తికర పోస్ట్ రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
దేశ భవిష్యత్తును నిర్దేశించేది యువశక్తేనని, వారు అనుకొన్నది సాధించి తీరుతారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పోరాడిన యువతకు, ఇతర వర్గాలకు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. హరీశ్రావు పోస్టు క్షణాల్లోనే వైరల్ అయింది. యువత, ఆయన మద్దతుదారులు ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ తమ మద్దతు ప్రకటించారు. సమాజంలో సరికొత్త ఆలోచనలు, యువశక్తికి ప్రాధాన్యం పెరగడానికి ఈ రకమైన సానుకూల ధోరణి ఎంతగానో తోడ్పడుతుందని నెటిజన్లు తమ కామెంట్లతో అభిప్రాయాలు వ్యక్తంచేశారు.