వికాసం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే వినోద్ అని.. ఈ ఎన్నిక ల్లో కారు గుర్తుకు ఓటేసి వినోద న్నను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఏర్పాటుచేసిన రోడ్ షోలో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావుతో కలిసి ఆయన ప్రచారం చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేదని.. అందుకే రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేస్తున్నాడని, ఈ ఝూటామాటల రేవంత్కు బుద్ధిచెప్పాలని కోరారు. పెట్రోల్, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపిన బీజేపీ ఇప్పుడు అక్షింతలు, దేవుళ్ల చిత్రపటాలు పంచుతూ రాజకీయం చేస్తోందని, ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ వెనుకబడిపోతుందని, హక్కుల కోసం గళమెత్తే వినోద్కుమార్ను ఆశీర్వదించాలని హరీశ్రావు కోరారు.
సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన బాండ్పేపరు బౌన్స్ అయిందని, అందుకే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడి దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని, ఒకవేళ హుస్నాబాద్కు వస్తే కొత్తకొండ వీరభద్రస్వామిపై ఒట్టు వేసేటోడని హరీశ్రావు చమత్కరించారు. ‘రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతున్నయ్.. మరోవైపు కాంగ్రెసోళ్ల, బీజేపోళ్ల అబద్ధపు ప్రచారాలు, మోసపూరిత వాగ్దానాలు విని తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నయ్.. ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అమలు చేసిందో ఇక్కడికి వచ్చిన అక్కాచెల్లెమ్మలే చెప్పాలి.. అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్ రూ.2వేల నుంచి రూ.4వేలకు పెంచుతామన్నరు.. తీరా ప్రభుత్వం వచ్చాక జనవరి నెలలో ఉన్న రూ.2వేల పింఛను కూడా ఇవ్వలే.. వెనుకటికో సామెత ఉన్నది.. అన్న వస్ర్తానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట.. ఈ నెల 9 తర్వాత రైతు భరోసా ఇస్తడట.. రూ.15వేలు ఇవ్వకుండా పది వేలు ఇస్తే అది రైతుబంధు అయితది తప్పితే రైతు భరోసా కాద’ని ఎద్దేవా చేశారు. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, మాఫీ కాని వాళ్లంతా బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు.
ముల్కనూరు ముద్దుబిడ్డ అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారన్నారు. ప్రవీణ్రెడ్డికి ఇచ్చిన గ్యారెంటీనే అమలు చేయలేదు.. ఆరు గ్యారెంటీలు వీళ్లు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ముల్కనూరు ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీసిందన్నారు. ఈ గ్రామబిడ్డ సుధీర్కుమార్కు కేసీఆర్ బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారని గుర్తుచేశారు. భీమదేవరపల్లి మండలాన్ని గౌరవించింది.. ముల్కనూరును ప్రేమించింది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తున్నదని.. కాంగ్రెస్ అంటేనే కరువని, కాంగ్రెస్ అంటేనే ఎవుసం మోటర్లు కాలిపోవుడని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేసే వరకూ అసెంబ్లీలో కొట్లాడుతానని హామీ ఇచ్చారు. బీజేపీకి ఓటేస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయని, జీఎస్టీ అమలు చేసి నిత్యావసర ధరలను పెంచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలను ప్రపంచ కుబేరులను చేసి రైతులకు మొండిచేయి చూపిందన్నారు. అక్షింతలు, దేవుళ్ల చిత్రపటాలు పంచిపెడితే ఓట్లు రావని, బీజేపీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం వెనుకబడుతుందన్నారు. అభివృద్ధి కావాలన్నా.. మన హక్కులు మనకు దక్కాలన్నా వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పార్లమెంటులో తెలంగాణ కోసం గళం విప్పాలంటే వినోదన్న తప్పక గెలవాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. వినోదన్నకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే తెలంగాణకు తప్పక న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో కష్టాలు మొదలయ్యాయన్నారు. కరెంటు ఉంటున్నదా.. రైతుబంధు, రైతుబీమా పడుతున్నాయా అని ప్రజలను అడిగారు. అనేక రంగాల్లో మనం వెనుకబడిపోతున్నామని తెలిపారు. రోడ్షోలో ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మండల సురేందర్, ఎంపీటీసీలు బొల్లంపల్లి రమేశ్, అప్పని పద్మ, షరిఫొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు సంగ సంపత్, ఏనుగు సత్యవతి, మాక లాజరస్, కీర్తి లత, మారుపాటి మహేందర్రెడ్డి, శనిగరం సదానందం, ఎల్తూరి ప్రభాకర్, రచ్చ సంపత్ పాల్గొన్నారు.
అభివృద్ధి అంటే బీఆర్ఎస్ అని, విధ్వంసం అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని.. మరి అభివృద్ధి కావాలా.. విధ్వంసం కావాలా ఆలోచించాలని బీఆర్ఎస్ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను గారడీ చేసి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ చేసింది చెప్పలేకనే దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గెలిచిన సోయం బాపూరావు, బండి సంజయ్, అరవింద్, కిషన్రెడ్డి, రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు ఏనాడూ తెలంగాణకు కావాల్సిన పనుల గురించి పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాల్లేవని విమర్శించారు. రాష్ర్టానికి 23 నవోదయ విద్యాలయాలు రావాల్సి ఉంటే బండి సంజయ్ మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఎల్కతుర్తి-సిద్దిపేట నేషనల్ హైవే కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఇప్పుడు పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అభివృద్ధిని ఆకాంక్షించి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.