న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మోహపాత్రా మాట్లాడుతూ మధ్య భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాపాతం ఉంటుందని తెలిపారు. ఉత్తర, దక్షిన భారతదేశంలో సాధారణంగా ఉంటాయని, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా పేర్కొన్నారు. వాయువ్య భారతంలో లేహ్, లడఖ్ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగానే వర్షాపాతం నమోదవుతుందని, జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటుందని డీజీ వివరించారు.
పసిఫిక్, భారత మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రత పరిస్థితులు రుతు పవనాలపై బలమైన ప్రభావాన్ని చూపుతున్నందున.. ఈ మహాసముద్ర బేసిన్లపై సముద్ర ఉపరితల పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తోన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇంతకు ముందు నైరుతి రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం కానుందని పేర్కొంది. ఈ నెల 3న ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశముందని చెప్పింది.