Odisha | భువనేశ్వర్, ఏప్రిల్ 24: ఒడిశా రాజకీయాల్లో లుంగీల లొల్లి నడుస్తున్నది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశించి ఒక వీడియోలో ప్రసంగించారు. ఇందులో ఆయన లుంగీ కట్టుకొని, పార్టీ గుర్తైన శంఖం ఉన్న ప్లకార్డులను పట్టుకున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఈ వీడియోలో ఓటర్లను అభ్యర్థించారు.
నవీన్ పట్నాయక్ లుంగీ కట్టుకొని వీడియోలో మాట్లాడటాన్ని బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎద్దేవా చేశారు. దీంతో ధర్మేంద్ర ప్రధాన్కు కౌంటర్గా బీజేడీ నాయకులు సస్మిత్ పాత్ర, స్వయంప్రకాశ్ మహోపాత్ర లుంగీలు ధరించి ప్రెస్మీట్ నిర్వహించారు. నవీన్ పట్నాయక్ ఫొటో ముందు లుంగీలతో పోజులిచ్చారు. దీంతో ఇప్పుడు బీజేడీ – బీజేపీ మధ్య లుంగీ వార్ ముదురుతున్నది. కాగా, ఒడిశాలో లుంగీలు ధరించడం సాధారణమే అయినప్పటికీ అది ఇంటివరకే పరిమితమై ఉంటుంది.