ఖమ్మం వ్యవసాయం, మే 5 : నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలు ఆదివారం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షంతో ఉపశమనం చెందారు. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో కొంత ఊరట కలిగింది. ఆదివారం ఒక్కసారిగా మేఘాలు అలుముకోవడం ఆ వెనువెంటనే బలమైన గాలులు వీచడం కొద్దిసేపటి తరువాత భారీ ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు ఖమ్మం నగరంతోపాటు ఆయా మండలాల్లో కురిశాయి. దీంతో ప్రజలు చల్లటిగాలులకు సేదదీరారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒకవైపు ఉరుములు, మరోవైపు మెరుపులు తోడు కావడంతో నగరవాసులు కాసింత ఇబ్బందులు పడ్డారు. అయితే కరెంట్ కటింగ్తో చిన్నపిల్లలు, వృద్ధులు ఇక్కట్లకు లోనయ్యారు. నగరంలో పాదాచారులు సైతం ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడ హోర్డింగ్లు కింద పడడంతో భయందోళనకు లోనయ్యారు. ఏదేమైనా మండు వేసవిలో అలా వచ్చి ఇలా వెళ్లిన వర్షంతో కాసింత ఉపశమనం పొందారు.
ఇల్లెందు/టేకులపల్లి, మే 5: ఇల్లెందు మండలం మామిడిగుండాలలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మామిడి కాయలు రాలాయి. గట్ల లక్ష్మి, బొమ్మెర గురవయ్యకు చెందిన రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. టేకులపల్లి మండలంలోని చింతోనిచెలక, సంపత్నగర్, బోడు, గంగారం తదితర గ్రామాల్లోని మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన కాయలు రాలిపడ్డాయి.