భద్రాద్రి కొత్తగూడెం, మే 17 (నమస్తే తెలంగాణ) : బాలల హక్కులు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాల అమలు వంటి అంశాల్లో తీసుకుంటున్న చర్యలపై జిల్లా సంక్షేమ, మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా బాలలకు రక్షణ కల్పించామన్నారు. బాలల భద్రత, శ్రేయస్సుకు సంబంధించి ప్రభావితం చేసే సమస్యలపై కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో విద్యాచందన, డీడబ్ల్యూవో విజేత, ఎస్సీ సంక్షేమాధికారి అనసూయ, బీసీ సంక్షేమాధికారి ఇందిర, మైనార్టీ సంక్షేమాధికారి సంజీవరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్, సంక్షేమ సమితి సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.