శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నప్పటికీ… మనసుకైన గాయం అంత త్వరగా మానదు. ఒకసారి మానసికంగా కుంగిపోతే ఆ సమస్య శరీరాన్ని పూర్తిగా పతనమయ్యేలా చేస్తుంది. ఇలాంటి వారిని మళ్లీ ఆత్మవిశ్వాసంతో నిలబడేలా చేస్తున్నది ఆ యువతి. కరోనా సమయంలో ఎంతోమంది మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. వాళ్లకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ‘గుడ్మైండ్’ యాప్ ద్వారా ఆంత్రప్రెన్యూర్ అవతారమెత్తింది సానియా మహ్మద్. ఆన్లైన్ వేదికగా వేలాది మందికి బతుకు భరోసాను ఇస్తూ వెరీవెరీ గుడ్ ఆంత్రప్రెన్యూర్ అనిపించుకుంటున్న సానియా స్టార్టప్ స్టోరీ ఇది..
హైదరాబాద్లో పుట్టి పెరిగిన సానియాకు… ఇక్కడి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై మంచి అవగాహన ఉంది. బద్రుకా కాలేజీలో బీకాం ఆనర్స్ చదువుతూనే… ఆంత్రప్రెన్యూర్గా ఎదగాలని అటువైపు అడుగులు వేసింది. ఆంత్రప్రెన్యూర్షిప్పై కాలేజీలో జరిగిన వర్క్షాప్ ఆమె అడుగులను సరికొత్త మార్గం వైపు వెళ్లేలా చేసింది. వినూత్న ఆలోచనలతో స్టార్టప్ ప్రారంభించాలనే ఎంతోమంది విద్యార్థులను ప్రోత్సహించే ఎడ్యువెంచర్ పార్క్ ఇంక్యుబేటర్ సంస్థ ఆమెకు అండగా నిలిచింది.
ప్రపంచాన్ని కబళించిన కరోనా మహమ్మారి లైఫ్ సైన్సెస్ రంగంలో స్టార్టప్లకు అవకాశం కల్పించింది. ఆ సమయంలో ప్రభుత్వ సంస్థతో కలిసి సేవలు అందించిన సానియా… స్వచ్ఛంద సేవలతో హైదరాబాద్లో ఉన్న ఎంతోమందికి చేరువైంది. కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వ్యాధి, చికిత్సపై అవగాహన లేకపోవడంతో చాలామంది మానసికంగా కుంగిపోయారు. ఎంతోమంది వ్యాధి రాకున్నా… అనుమానాలతో మానసికంగా చితికిపోయారు. అలా మనోవ్యథ చెందిన ఎంతోమందిని అక్కున చేర్చుకుంటూనే… ‘గుడ్మైండ్’ యాప్కు రూపకల్పన చేసింది. తనకు తోచిన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకువచ్చి గడిచిన ఐదేండ్లుగా మానసిక దుర్బలులకు ధైర్యాన్ని ఇస్తున్నది.
ఆధునిక యుగంలో జనాలు ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. కానీ, ఎవరూ పట్టించుకోకపోవడంతో కొందరు ఆత్మహత్యకూ పాల్పడుతున్నారు. రానున్న కాలంలో శారీరక సమస్యల కన్నా.. మానసిక రుగ్మతలతో సంభవించే ప్రాణ నష్టం ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఇటీవలి కాలంలో అధ్యయనాల్లోనూ మానసిక రుగ్మతల కారణంగా ఎందరో బలవన్మరణానికి పాల్పడుతున్నారని వెల్లడైంది. అలాంటివారిని రక్షించడమే ధ్యేయంగా గుడ్మైండ్ పనిచేస్తుంద’ని చెబుతున్నది సానియా.
ప్రపంచ మానసిక అధ్యయన సంస్థలు సూచించిన ప్రశ్నావళి సాయంతో ఆన్లైన్ ద్వారానే బాధితుల మానసిక స్థితిగతులు తెలుసుకునేలా యాప్ను రూపొందించిందామె. వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో… ఎవరికీ చెప్పుకోలేని సమస్యలను యాప్ ద్వారా నిపుణులతో పంచుకుంటున్నారు బాధితులు. ఆన్లైన్లో వారి మానసిక స్థితిని అంచనావేసి, సమస్యలకు ఈ యాప్ పరిష్కారం చూపుతున్నది. వీరికి కావాల్సిన చికిత్సలు, వైద్య సదుపాయాలు, డాక్టర్ కన్సల్టెన్సీ వంటి సౌకర్యాలను సమకూర్చుతున్నది. యాప్ యూజర్లకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నది.
ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే మదన పడుతున్న వారికి ఆపన్నహస్తం అందించే వ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సానియా చెబుతున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తుల మతిగతులను యాప్ అంచనా వేస్తుంది. వినూత్న ఆలోచనలతో వ్యక్తిగతంగానే కాకుండా.. కార్పొరేట్ రంగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం అందించే మెంటల్ హెల్త్ థెరపిస్టుగా ‘గుడ్మైండ్’ పనిచేస్తున్నది.
పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవలు అందిస్తున్నది. అయినవాళ్లు తోడురాకున్నా.. ‘గుడ్మైండ్’ తోడుంటే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే భరోసా కలిగించేలా సంస్థను తీర్చిదిద్దుతామని సానియా చెబుతున్నది. https://www.goodmind.app/ వెబ్సైట్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండానే మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేసుకునేలా అవకాశం ఉందంటున్నది. మొత్తంగా ఈ కాలమాన పరిస్థితులకు తగ్గ యాప్ డిజైన్ చేసి ఆంత్రప్రెన్యూర్గా విజయం సాధించిన సానియా ఈ తరం యువతకు నిండైన ఆదర్శం.
ఒక్కరుగా మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో ఇప్పుడు ఎందరో కలిశారు. వందమందికిపైగా అంబాసిడర్లు, 50కిపైగా మానసిక వైద్య నిపుణులు బాధితుల పక్షాన నిలుస్తున్నారు. ఏకంగా 50వేల మందిని మానసిక దౌర్బల్యం నుంచి బయటపడే దిశగా ‘గుడ్మైండ్’ యాప్ పనిచేస్తున్నది. ‘అమ్మనాన్నలు వెన్ను తట్టి నడిపించారు. ఎడ్యువెంచర్ పార్క్ కీలకపాత్రను పోషించింది. ఆ ఇంక్యుబేషన్ సెంటర్ అందించిన ఆర్థిక సాయంతో సంస్థను అభివృద్ధి చేస్తున్నాను. ఈ క్రమంలో గూగుల్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు ‘గుడ్మైండ్’ను ఉత్తమ స్టార్టప్గా ఎంపిక చేశాయి. అవార్డులు, రివార్డులతో ప్రోత్సహించాయి’ అంటుంది సానియా.
– కడార్ల కిరణ్