భద్రాద్రి కొత్తగూడెం, మే 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం ఐడీవోసీలోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం,
మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రథమ సంవత్సరం 5,408 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 2,726 మంది రాయనున్నారని తెలిపారు. సమీక్షలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి, జిల్లా వైద్య శాఖ అధికారి శిరీష, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.