RGV | ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులకు ఎంత ముప్పు రాబోతుందో ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
ప్రస్తుతం ఉన్న పాలనా వ్యవస్థలో రాజకీయ నాయకులు అధికారులను పర్యవేక్షిస్తుంటే, ఆ అధికారులు ప్రభుత్వ పనులను నిర్వహిస్తున్నారాని. ఈ మొత్తం వ్యవస్థ కేవలం ‘నిజాయితీ’, ‘నిర్భయం’ అనే రెండు మానవ బలహీనతల మీద ఆధారపడి నడుస్తోందని ఆర్జీవీ చెప్పుకోచ్చాడు. అయితే ఒక అధికారి కూడా సాధారణ మనిషే కదా! అతనిపై బదిలీ అవుతుందనే భయం, పిల్లల స్కూల్ అడ్మిషన్ల టెన్షన్, పెద్ద ఇల్లు కొనుగోలనే కోరిక, ఒక్క ఫోన్ కాల్తో తన కెరీర్ను నాశనం చేయగల రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటాయి. అందుకే ఇక్కడ నిబంధనలు పక్కదారి పడతాయి, లంచం ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతాయని వర్మ అన్నారు.
ఒకవేళ ఆ మనిషి స్థానంలో ‘ఏఐ’ (AI) ని ఉంచితే పరిస్థితి ఎలా ఉంటుంది? అల్గారిథమ్కు ఎవరూ లంచం ఇవ్వలేరు, బదిలీ భయం చూపలేరు. అర్ధరాత్రి ఫోన్ చేసి మంత్రి బంధువుకు కాంట్రాక్ట్ ఇవ్వమని ఎవరూ ఒత్తిడి తేలేరు. దానికి కుటుంబం లేదు, పెన్షన్ల టెన్షన్ అంతకంటే లేదు. దుబాయ్లో ఇప్పటికే ఎలాంటి మనుషుల ప్రమేయం లేకుండా కేవలం యంత్రాల ద్వారా నడిచే ‘స్మార్ట్ పోలీస్ స్టేషన్లు’ పనిచేస్తున్నాయి. అక్కడ ఎలాంటి లంచాలకు తావులేకుండా ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ నమోదు అవుతున్నాయి. ఇది సినిమా కథ కాదు, ఇప్పుడు నిజంగానే అమలవుతున్న వాస్తవం అని తెలిపారు.
పరిపాలన పూర్తిగా అవినీతి రహితంగా మారిన తర్వాత ఇక రాజకీయ నాయకుల అవసరం ఏముంటుంది? ఉదాహరణకు, ఒక ఊరిలో పత్తి పంట తగ్గిందని, ప్రభుత్వం ఒక నిర్దిష్ట పురుగుమందును కొనాలని ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో కోరతాడనుకుందాం. వెంటనే ప్రతిపక్ష ఎమ్మెల్యే లేచి.. ఆ లెక్కలు తప్పు అని, ఆ ఎమ్మెల్యే బంధువుకి ఆ పురుగుమందు ఫ్యాక్టరీ ఉందని ఆరోపిస్తాడు. పంట నిజంగానే నష్టపోయిందా? ఆ పురుగుమందు నిజంగానే పనిచేస్తుందా? లేదా ఎమ్మెల్యే బంధువు కోసం ఈ డ్రామా నడుస్తోందా? అనే నిజాలు సాధారణ ఓటర్లకు ఎప్పటికీ తెలియవు.
అయితే అదే ఆ ఎమ్మెల్యే స్థానంలో ‘ఏఐ’ ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. దానికి ఏ అధికారినో అడిగి సేకరించిన సెలెక్టివ్ డేటా అవసరం లేదు. శాటిలైట్ ఫొటోలు, నేల స్వభావం, వర్షపాత వివరాలు, ప్రపంచ మార్కెట్లో ధరలు, గత పదేళ్లలో ఆ పురుగుమందు పనితీరును క్షణాల్లో విశ్లేషించి అతిపెద్ద సరైన పరిష్కారాన్ని నంబర్లతో సహా కళ్లముందుంచుతుంది. అక్కడ ఎమ్మెల్యే బంధువు ఉండడు, ఎన్నికల్లో ఓడిపోతాననే భయం ఉండదు, బంధువులను బాగు చేయాలనే దురాశ ఉండదు. ఏఐ వద్ద ఉన్న డేటా, విశ్లేషణ శక్తి ఏ రాజకీయ నాయకుడికీ ఉండదు కాబట్టి ఎవరూ దాన్ని ప్రశ్నించలేరంటూ ఆర్జీవీ అన్నారు.
అలాగే.. ప్రజా ప్రతినిధులు ఇప్పటివరకు ఓటర్ల సమస్యలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధులుగా ఉంటూ వచ్చారు. కానీ, ఏఐ కనుక వస్తే వ్యవస్థను పారదర్శకంగా, తక్షణమే, అవినీతి రహితంగా మార్చేస్తే ఈ మధ్యవర్తుల అవసరమే లేకుండా పోతుంది. జవాబుదారీతనం కావాలి అంటూ నాయకులు దీనిని వ్యతిరేకించవచ్చు. కానీ అసలు భయం వేరు.. ఇకపై వారు ఎవరికీ మేలు చేయలేరు, తమ నెట్వర్క్లను కాపాడుకోలేరు, ప్రభుత్వ పదవిని స్వార్థానికి వాడుకోలేరు. భవిష్యత్తులో ప్రభుత్వాలను ఎవరూ కూలదోయాల్సిన పనిలేదు, అవే అల్గారిథమ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఆర్థిక అభివృద్ధి, రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు వంటివి మానవ నైతిక నిర్ణయాలు అని కొందరు వాదించవచ్చు. కానీ, ఇప్పటివరకు రాజకీయ నాయకులు, అధికారులు ఎంతమాత్రం మానవత్వంతో ఆలోచించారని వర్మ ప్రశ్నించారు. ఏఐ చూడటానికి మనిషి కాకపోవచ్చు, కానీ మనుషుల కంటే అది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
AI WILL KILL GOVERNMENTS
In the present governance system the political class oversees the bureaucracy which administers the procedures for the functioning of the state .. Political leaders are elected to “represent” people. Bureaucrats are hired to follow procedures for…
— Ram Gopal Varma (@RGVzoomin) July 29, 2026