Wrestlers | ఢిల్లీ: ఒలింపిక్స్ బరిలో నిలిచేందుకు గాను అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తమ ‘బెర్తు’ను ఖాయం చేసుకున్నా రెజ్లర్లు మాత్రం తాము ‘పారిస్’కు వెళ్తామా..? లేదా..? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకూ వేర్వేరు విభాగాల్లో ఐదు బెర్తులు మాత్రమే ఖాయమైనా.. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తీరుతో కోటాను ఖాయం చేసుకున్న రెజ్లర్లూ ఆందోళనకు గురవుతున్నారు. డబ్ల్యూఎప్ఐ మళ్లీ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తానని చెప్పడం గందరగోళానికి దారితీస్తోంది.
డబ్ల్యూఎఫ్ఐ తీరు వల్ల మెగా టోర్నీ ముంగిట తమకు మనశ్శాంతి కరువైందని వాళ్లు వాపోతున్నారు. భారత్కు తొలి బెర్తును అందించిన అన్షు మాలిక్ (57 కిలోలు) మాట్లాడుతూ.. ‘ఇటీవల కాలంలో నేను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నాను. నా ఫిట్నెస్ను కొత్తగా నిరూపించుకునేదేమీ లేదు. ఒలింపిక్స్ ముందు మాకు మానసిక ప్రశాంతత కావాలి. ఈ స్థితిలో ప్రతి రోజూ మాకు కీలకమే. నేను జూన్ 10 నుంచి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంప్ కోసం యూరప్ వెళ్లాల్సి ఉన్నా డబ్ల్యూఎఫ్ఐ ట్రయల్స్ కారణంగా దానిపై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నా’ అని ఆవేదన వ్యక్తం చేసింది. మరో రెజ్లర్, 68 కిలోల విభాగంలో బెర్తును దక్కించుకున్న నిషా దహియా స్పందిస్తూ.. ‘క్వాలిఫయర్స్ కోసం నేను బరువు తగ్గి గాయాలతో ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నా. ఇప్పుడు మళ్లీ ట్రయల్స్ అంటే అది నా శరీరం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని తెలిపింది. రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్పై డబ్ల్యూఎఫ్ఐ ఈనెల 21న ఢిల్లీలో సమావేశమవనుంది.