Congress | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుక మడతేయడం అలవాటుగా మారింది. సన్న వడ్లు పండించే రైతులకే బోనస్సు ఇస్తామని సీఎం అనని మాట అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్ అంటే, తాజాగా కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి కూడా ఇదే మాట అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని, ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి ప్రకటించడం తెలిసిందే. డిసెంబర్లో అధికారాన్ని చేపట్టిన సమయంలో ధాన్యానికి బోనస్ ఎప్పుడిస్తారని ప్రశ్నించగా.. ‘ఇప్పుడే కదా వచ్చింది.. యాసంగి సీజన్కు ఇస్తాం’ అని ప్రభుత్వ పెద్దలు చెప్పారు.
ఏప్రిల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనప్పటికీ బోనస్ అంశాన్ని మాత్రం మంత్రులెవరూ ప్రస్తావించలేదు. ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని పౌరసరఫరాల సంస్థ, అటు ప్రభుత్వం ప్రకటించాయి తప్ప బోనస్పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఇక ఆ అంశాన్ని పూర్తిగా మరిచిపోయారు. తాజాగా ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి పాత్రికేయులతో చిట్చాట్ చేస్తూ కేవలం సన్న వడ్లు పండించే రైతులకు మాత్రమే రూ.500 బోనస్సు ఇవ్వనున్నట్టు చెప్పారు.
ఈ విషయం దాదాపు అన్ని పత్రికలలో వచ్చింది. దీనిపై రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కాగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయినప్పటికీ సీఎం రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోగా.. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో కొందరు నేతలు సీఎంను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ మహేశ్కుమార్గౌడ్ సీఎం అనని మాటలను అన్నట్టు ప్రతిపక్ష పార్టీ తమ ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కిసాన్ సెల్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్రెడ్డి సైతం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని సీఎం ఎక్కడా అన్లేదని చెప్పుకొచ్చారు.