Katrina Kaif | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’. అనౌన్స్మెంట్ జరిగిన నాటి నుంచే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి బాలీవుడ్లో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్గా మారింది. అదేంటంటే.. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం. ‘స్పిరిట్’లో ఇప్పటికే హీరోయిన్గా తృప్తి డిమ్రి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో హీరోయిన్గా కాకుండా, కథలో కీలక మలుపు తీసుకొచ్చే ప్రత్యేక పాత్ర కోసం కత్రినా కైఫ్ను చిత్రబృందం సంప్రదించినట్లు ముంబై సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
స్క్రీన్పై ఆమె కనిపించే సమయం పరిమితంగానే ఉన్నప్పటికీ, కథను ప్రభావితం చేసే పవర్ఫుల్ రోల్లో కత్రినా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రారంభంలో ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొణె పేరు వినిపించింది. అయితే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత తృప్తి డిమ్రిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కత్రినా కైఫ్ పేరు తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్ట్పై మరింత ఆసక్తి పెరిగింది. కత్రినా కైఫ్ గతంలో విక్టరీ వెంకటేష్తో ‘మల్లీశ్వరి’, నందమూరి బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా బాలీవుడ్కే పరిమితమయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె స్పిరిట్ లో నటిస్తే, అది ఆమెకు చాలా కాలం తర్వాతి తెలుగు సినిమా అవుతుంది.
ప్రస్తుతం కత్రినా కైఫ్ ‘స్పిరిట్’లో నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు కత్రినా కైఫ్ గానీ, చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గానీ, నిర్మాణ సంస్థ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.