న్యూఢిల్లీ : యాస్ తుఫాను నేపథ్యంలో బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని, భద్రత కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. తుఫాను తీరానికి చేరుతున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫానుగా మారుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 26న ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఒడిశా, బెంగాల్లో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. 26, 27 తేదీల్లో అసోం, మేఘాలయలోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. యాస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు. బెంగాల్ ఇప్పటికే 35 బృందాలను మోహరించారు. అలాగే తమిళనాడు, ఏపీ, అండమాన్ నికోబార్ దివులకు సైతం బృందాలను తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఎస్ఎన్ ప్రధాన్ పేర్కొన్నారు. తుఫానును దృష్టిలో పెట్టుకొని తూర్పు రైల్వే ఈ నెల 24 నుంచి 29 తేదీల మధ్య 25 రైళ్లను రద్దు చేసింది.