ఆంటిగ్వా: ఆర్థిక నేరగాడు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ((PNB)) కొన్నివేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారి, గీతాంజలీ గ్రూప్ చైర్మన్ మోహుల్ చోక్సీ కన్పించకుండా పోయారు. తన మామ నీరవ్ మోదీతో కలిసి PNBని సుమారు రూ.14 వేల కోట్లు ముంచిన చోక్సీ.. నిన్నటి నుంచి జాడలేకుండా పోయారు. ఈ విషయాన్ని ఆయన కౌన్సిల్ అడ్వకేట్ విజయ్ అగర్వాల్ ధృవీకరించారు.
మోహుల్ చోక్సీ ద్వీప దేశమైన ఆంటిగ్వాలో కన్పించకుండా పోయారని వెల్లడించారు. దీంతో ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులు తనను పిలిచి మాట్లాడారని అగర్వాల్ చెప్పారు. ఈ విషయమై ఆంటిగ్వా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని వెల్లడించారు. అతని భద్రత గురించి కుటుంబ సభ్యులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారని తెలిపారు.
మోహుల్ చోక్సీ కోసం ఆంటిగ్వా పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారని స్థానిక మీడియా వెల్లడించింది. గత సాయంత్రం అక్కడి ప్రముఖ రెస్టారెంట్లో డిన్నర్ చేయడానికి ఇంటి నుంచి వెళ్లిన ఆయన తర్వాత కన్పించకుండా పోయారని, అతని వాహనాన్ని జాలీ హార్బర్లో గుర్తించారని వెల్లడించింది. అయితే అతని జాడ మాత్రం లభించలేదని ఆంటిగ్వా న్యూస్రూమ్ పేర్కొన్నది.
61 ఏండ్ల మోహుల్ చోక్సీ.. తన మామ నీరవ్ మోదీతో కలిసి సుమారు రూ.14 వేల కోట్లు రుణం ఎగవేసి విదేశాలకు చెక్కేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసిన అధికారులు చోక్సీ పాస్పోర్టును రద్దు చేశారు.
కాగా, కరేబియన్ దేశమైన ఆంటిగ్వా బార్బడోస్లో తలదాచుకుంటున్న చోక్సీకి అక్కడి ప్రభుత్వం.. 2017, నవంబర్లో పౌరసత్వం కల్పించింది. అయితే ఆర్థిక నేరగాడైన అతడికి పౌరసత్వం కల్పించడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. దీంతో అతన్ని ఇండియాకు పంపుతామని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.