మంచిర్యాల, జూలై 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నపళంగా తీసుకుంటే రోడ్డున పడుతామని.. ముందుగా ప్రభుత్వం తమ భూములకు ధర నిర్ణయించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని తెగేసి చెప్తున్నారు. ఇప్పటికే ప్రభావిత గ్రామాల్లో అధికారులు నిర్వహించే గ్రామసభలను బహిష్కరిస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరిస్తేనే సర్వేకు సహకరిస్తామంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో గూడ, రాంపూర్, హత్తిఘాట్, కొరాటా గ్రామాల్లోని 2,064 ఎకరాల భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా, రెవెన్యూ అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజులు పూర్తికావడంతో స్థానిక రైతుల నుంచి అభ్యంతరాలు, అర్జీలను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అని రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు రైతులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. రైతుల వివరాల కోసం అధికారులు నిర్వహించే గ్రామసభలను బహిష్కరిస్తున్నారు. ఇటీవల గూడ, గిమ్మలో సర్వేను బహిష్కరించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ వివరాలు అందించేది లేదని, ఎలాంటి పత్రాలు రాసి ఇవ్వబోమని తేల్చిచెప్తున్నారు. తాతల కాలం నుంచి భూములు సాగుచేసుకుంటూ బతుకుతున్నామని, ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటే ఊరుకోబోమని హెచ్చరిస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
గతంలో కొన్ని బడా కంపెనీలు తమ తాతల నుంచి ఎకరాకు రూ.30వేల చొప్పున తీసుకొని దగా చేశారని.. ఇలా భూసేకరణతో పెద్దోళ్లు లాభపడితే, రైతులు రోడ్డున పడాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండు పంటలు సాగుచేసుకునే భూములను కోల్పోతే, ఇతర గ్రామాల్లో ఎకరాకు రూ.60 లక్షలు ఇచ్చినా భూమి దొర క దని రైతులు వాపోతున్నారు. అంతేగాక భూ ముల సర్వేపై అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని, తమకు తెలియకుండా సర్వేలు చేపట్టడం సరికాదని మండిపడుతున్నారు.
రెవెన్యూ అధికారులు సూచిస్తున్న ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని మెజారిటీ రైతులు అభిప్రాయపడుతున్నారు. వారు చెప్తున్నట్టు ప్రకారం ఎకరానికి రూ.10 లక్షలు కూడా రావని, అంత తక్కువ ధరకు బంగారం పండించే తమ భూములు ఎలా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చనాక-కోరాటా ప్రాజెక్టుతో తమ భూములకు సాగునీరు అందుతున్నదని, దీంతో తాము రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం వచ్చిందంటున్నారు. ఎకరాకు రూ.60 లక్షలు చెల్లించాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భోరజ్ మండలం కొరాటలో భూముల అమ్మకాలు, కొనుగోలు చేయకుండా హోల్డ్లో పెట్టారని, వెంటనే దానిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం భోరజ్ మండలం గూడ, గిమ్మతో పాటు పలు గ్రామాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబస్తీ పథకంలో భాగంగా 2018లో మూడు ఎకరాల భూమిని పంపిణీ చేసింది. ఎనిమిదేండ్లుగా రైతులు ఆ భూముల్లో పంటలు పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. సారవంతమైన భూములు కావడంతో ఎకరంలో 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తున్నది. రైతులు పత్తితో పాటు సోయాబిన్ పంటలు పండిస్తుండగా ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. రైతులు మంచి పంటలు పండిస్తుండటంతో ఈ భూముల ధరలు సైతం బాగా పెరిగాయి. ఎకరాకు కనీసం రూ.30 నుంచి 40లక్షల వరకు ఉంటుందని లబ్ధిదారులు అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను.. కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొని అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నారు.
ఆదిలాబాద్లో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పెడ్తామని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇందుకోసం తొలి విడుత 2026 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. మరో 1,022 ఎకరాలకు జీవో జారీ చేశారు. కాగా తొలివిడుతలో సేకరిస్తామన్న 2,026 ఎకరాల్లో దాదాపు రెండు వేల ఎకరాలు రెండు దశాబ్దాల క్రితమే ఓ సంస్థ కొనుగోలు చేసింది. సదరు సంస్థ ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టగా.. చివరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) వేలంలో బెంగళూరుకు చెందిన కంపెనీ వాటిని దక్కించుకున్నది. బెంగళూరుకు చెందిన ఎక్స్ ఫ్యాక్టర్ కమల్ ట్రేడర్స్ కంపెనీ రూ.40 కోట్లకు ఈ భూములను వేలంలో పొందింది.
తాజాగా భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్లో దాదాపు 660 ఎకరాలు తనఖా భూములు(ఎక్స్-ఫ్యాక్టర్) కంపెనీ భూములు ఉన్నట్టు చెప్తున్నారు. కాగా బ్యాంకుల్లో తనాఖా పెట్టేముందు రైతుల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు తప్ప, రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ కంపెనీ పేరుపైకి బదలాయించలేదు. తనఖా పెట్టిన భూములను బదలాయించుకొని పరిహారం కొట్టేయడంతో పాటు రానున్న రోజుల్లో తనకు సంబంధించిన పరిశ్రమలను తీసుకొచ్చి దోచుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారన్న వార్తలు స్థానికంగా అగ్గిరాజేస్తున్నాయి. ఇలా ఆయన స్వార్థం కోసం తమను బలిపశువులను చేస్తున్నారంటూ స్థానిక రైతులు మండిపడుతున్నారు.
కాగా ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ వచ్చాక.. అందులో తమ సంస్థ ఈ-వేలంలో దక్కించుకున్న భూములు ఉండటాన్ని చూసి అవాక్కైన బెంగళూరు ఎక్స్-ఫ్యాక్టర్ కంపెనీ తాము వేలంలో పొందిన భూములకు హద్దులు చూపించాలని, పట్టా పాస్బుక్లు ఇవ్వాలని, ఆ భూముల క్రయవిక్రయాలు జరుగకుండా చూడాలని కలెక్టర్, తహసీల్దార్, సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ దరఖాస్తులు చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక 60 రోజులపాటు ఆ భూముల్లో పనులు చేయకూడదనే నిబంధన ఉన్నది. రెండు రోజుల క్రితమే నోటిఫికేషన్ వచ్చి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఎక్స్-ఫ్యాక్టర్ సంస్థకు భూములు అప్పగిస్తారా?.. లేదా? అనేది తేలాల్సి ఉన్నది. నోటిఫికేషన్ జారీ చేసి ఇరుక్కుపోయామని భావిస్తున్న అధికార యంత్రాంగం ఆ బెంగళూరు కంపెనీకి ఏం సమాధానం చెప్తుందన్నది ఆసక్తిగా మారింది
బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత అభివృద్ధి శాఖ ద్వారా భూమిలేని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ మూడెకరాల భూమి పంపిణీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకం పేద వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు వరంగా మారింది. జిల్లావ్యాప్తంగా 1,693 మంది పేద దళిత కుటుంబాలకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 4,367.30 ఎకరాలను ఉచితంగా అందజేసింది. ఇందుకుగానూ రూ.190.90 కోట్లు ఖర్చు చేసింది. కేసీఆర్ సర్కార్ అందించిన భూముల్లో రైతులు బంగారు పంటలు పండిస్తూ సంతోషంగా బతుకుతున్నారు. గతంలో కూలీలుగా పనిచేసిన వారు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన భూముల్లో రెండు సీజన్లలో పత్తి, కంది, సోయాబీన్, శనగ, జొన్నలు సాగు చేస్తూ ఆదాయం గడిస్తున్నారు.
దళిత అభివృద్ధి శాఖ నుంచి భూమిని పంపిణీ చేసిన ప్రభుత్వం వారికి పంట పెట్టుబడి సాయాన్ని సైతం అందజేసింది. రైతులకు ఎడ్లు, నాగలి, బండ్లు ఇతర వ్యవసాయ పనుల కోసం అవసరమైన నగదు సమకూర్చింది. రైతుబంధు పథకంలో భాగంగా సంవత్సరానికి ఎకరాకు రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేసిన గత ప్రభుత్వం, దళిత రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సాయంతో గతంలో కూలీలుగా పనిచేసిన వారు ఇప్పుడు రైతులుగా మారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఆ భూములకు ఎసరు పెట్టింది
అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతులను రోడ్డుపాలు చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఇండస్ట్రియల్ పార్కులో నా ఎనిమిది ఎకరాల భూమి పోతుందని అధికారులు అంటున్నారు. ఈ భూమే నా కుటుంబానికి ఆధారం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రైతులు భయపడుతున్నరు. ఎకరాకు ఎంత ధర ఇస్తారో చెప్పకుండా భూసేకరణ చేయడం అన్యాయం. కారిడార్కు మా భూములు తీసుకోవద్దని ఇప్పటికే అధికారులను కలిసి చెప్పాం.
– బొల్లు చిరంజీవి, రైతు, కొరాటా, భోరజ్ మండలం, ఆదిలాబాద్
నేను ఎన్నో ఏండ్ల నుంచి కూలీ పనులు చేసుకుంట బతికేది. కేసీఆర్ ప్రభుత్వం మూడు ఎకరాలు ఇచ్చి మా బతుకులు మార్చింది. ఆ భూమిలో మంచిగ పంటలు పండించుకుంట సంతోషంగా ఉంటున్నం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి కేసీఆర్ ఇచ్చిన భూములను గుంజుకొని తినే అన్నంలో మన్ను పోస్తదట. నాకు 65 ఏండ్లు. ఇప్పుడు నేను కూలీ పనికి పోయే పరిస్థితి లేదు. భూమి పోతే ఎట్ల బతకాలె. దయచేసి మమ్ముల రోడ్డున పడేయద్దు.
– దేవన్న, రైతు, గూడ, భోరజ్ మండలం, ఆదిలాబాద్