తిరువనంతపురం: ఛాతిలో నొప్పి రావడంతో ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ ఆసుపత్రికి బయలుదేరాడు. ట్రాఫిక్లో చిక్కుకున్న అతడికి గుండెపోటు రావడంతో కారులో కుప్పకూలాడు. గమనించిన ఇద్దరు నర్సులు బస్సు దిగి ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించి అతడి ప్రాణాలు కాపాడారు. (Nurses Save Man) కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఓక్కల్ సమీపంలోని తన్నిపుళలో లాటరీ టికెట్ల షాపు నిర్వహిస్తున్న 43 ఏళ్ల సినోజ్కు బుధవారం ఉదయం ఛాతిలో తీవ్రంగా నొప్పి వచ్చింది. దీంతో స్వయంగా కారు నడుపుకుంటూ ఆసుపత్రికి బయలుదేరాడు. ఎంసీ రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది. సినోజ్కు గుండెపోటు రావడంతో తన కారులో కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు ఆ కారు వద్ద గుమిగూడారు.
కాగా, అంగమాలిలోని ఎల్ఎఫ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న అంజలి బైజు, బెంగళూరులో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆర్ద్ర రాజ్, కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. రోడ్డు పక్కన జరుగుతున్న గందరగోళాన్ని వారు గమనించారు. కారులోని వ్యక్తి గుండెపోటుకు గురైనట్లు ఆ ఇద్దరు నర్సులు తెలుసుకున్నారు. వెంటనే కదులుతున్న బస్సు నుంచి వారు కిందకు దిగారు. ఆ కారు వద్దకు పరుగున చేరుకున్నారు. లోపలున్న సినోజ్కు సీపీఆర్ ప్రారంభించారు.
మరికొందరు స్థానికులు కూడా సహాయం కోసం ముందుకు వచ్చారు. ఒక వ్యక్తి సినోజ్ కారును నడిపాడు. కొందరు వ్యక్తులు ఆ వాహనం వెళ్లేందుకు దారి కల్పించారు. అంబులెన్స్ రప్పించి సినోజ్ను అంగమాలిలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు ఆ ఇద్దరు నర్సులు ఆయనకు సీపీఆర్ కొనసాగించారు. దీంతో ఆసుపత్రికి చేరుకునే సమయానికి అతడు కోలుకుంటున్న సంకేతాలు కనిపించాయి.
మరోవైపు సినోజ్ను పరీక్షించిన డాక్టర్లు అతడి కరోనరీ ఆర్టరీ మూసుకుపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేశారు. మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసుపత్రికి అతడ్ని తరలించనున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇద్దరు నర్సుల సకాల స్పందన, అక్కడి ప్రజల సహాయాన్ని పలువురు ప్రశంసించారు. వారి తక్షణ స్పందనే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిందని చాలా మంది కొనియాడారు.