అహ్మదాబాద్: సహజీవనం చేస్తున్నది మహిళ కాదు పురుషుడని తెలిసి ఒక యువకుడు షాక్ అయ్యాడు. స్వలింగ సంపర్కాన్ని కోరుకునే అతడితో సంబంధాన్ని ముగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఉద్యోగం మారిన చోట్లకు ఆ వ్యక్తి వెంటపడటంతో చివరకు అతడ్ని హత్య చేశాడు. (Live-in woman turned to be a man) ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల పియూష్ కుమార్ ఖర్వార్ తొలుత హైదరాబాద్లో పని చేశాడు. ‘నిషా’ అన్న మహిళ పేరుతో ఫేస్బుక్లో మెసేజ్ రావడంతో పరిచయం పెంచుకున్నాడు.
కాగా, ఫేస్బుక్లో ‘నిషా కుమార్’గా, ఇన్స్టాగ్రామ్లో ‘పూనమ్’ అని మహిళగా పేర్కొన్న చందన్ కుమార్ను యువతిగా భావించిన పియూష్ కుమార్ సంబంధాన్ని పెంచుకున్నాడు. వారిద్దరూ కలిసి హైదరాబాద్లోని ఒక రూమ్లో సహజీవనం చేశారు. ఎల్లప్పుడూ లేడీస్ డ్రెస్ ధరించిన చందన్ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మతపరమైన కారణాల సాకుతో శారీరక సాన్నిహిత్యాన్ని నిరాకరించాడు.
అయితే ఒక రోజు చందన్ గడ్డం గీసుకోవడం చూసిన పియూష్కు అసలు విషయం తెలిసింది. అప్పటి వరకు స్త్రీ అని భావించిన వ్యక్తి నిజానికి స్వలింగ సంపర్క సంబంధాన్ని కోరుకునే పురుషుడని అతడు గ్రహించాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చందన్తో బంధాన్ని ముగించాలని పియూష్ నిర్ణయించాడు. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆ తర్వాత గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాకు ఉద్యోగాలు మారాడు.
అయినప్పటికీ పియూష్ను చందన్ వదలలేదు. అతడు ఉద్యోగం మారిన చోట్లకు చందన్ వెళ్లాడు. చివరగా జూన్ 21న రాజ్కోట్లోని పద్వాల గ్రామంలోని ఫ్యాక్టరీ వద్ద వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత చందన్ను పియూష్ రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పెద్ద బండరాయితో కొట్టి చందన్ను హత్య చేశాడు. బండ రాళ్ల కింద మృతదేహాన్ని దాచి పారిపోయాడు.
మరోవైపు జూన్ 25న రైల్వే ట్రాక్ సమీపంలో మహిళ దుస్తులు ధరించి, కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. పోస్ట్మార్టంలో తలకు తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలడంతో చందన్ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో పియూష్ కుమార్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడ్ని ప్రశ్నించగా చందన్ హత్య కారణాన్ని వెల్లడించాడని పోలీస్ అధికారి తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.