DGP CV Anand | హైదరాబాద్, జూలై 2 : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (ఐపీఎస్) గురువారం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ, పరిధుల విభజన, పరిపాలనా అవసరాలు తదితర అంశాలపై తమ ప్రతిపాదనలను డీజీపీకి వివరించారు.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీఓలు)కు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ హద్దులను నిర్ణయించాలని సూచించారు.
భవిష్యత్ పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో పోలీస్ స్టేషన్ల పరిధులను పునర్వ్యవస్థీకరించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో సంబంధిత అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ స్టేషన్లకు తగిన పేర్లు నిర్ణయించాలని..
హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల పోలీస్ స్టేషన్ పరిధుల నిర్ణయంపై ప్రత్యేక సూచనలు చేసిన డీజీపీ, పోలీస్ స్టేషన్ ల పరిధుల మార్పులు , చేర్పుల నిర్ణయం వల్ల ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, ఆయా ప్రాంతాల భౌగోళిక, పరిపాలనా ప్రత్యేకతలను ప్రతిబింబించే విధంగా పోలీస్ స్టేషన్లకు తగిన పేర్లు నిర్ణయించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రజాకేంద్రిత, సమర్థవంతమైన పోలీసింగ్ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని డీజీపీ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (ఐపీఎస్) ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి (ఐపీఎస్) , సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, (ఐపీఎస్) మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి (ఐపీఎస్)తో పాటు జాయింట్ కమిషనర్లు, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.