న్యూఢిల్లీ : తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిలో చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ దరఖాస్తు చేసింది. కాక్టెయిల్కు జైడస్ క్యాడిలా ZRC-3308 పేరు పెట్టింది. తేలికపాటి లక్షణాలున్న కేసుల్లో కాక్టెయిల్ ప్రధాన చికిత్సల్లో ఒకటిగా మారుతుందని కంపెనీ పేర్కొంది. యూఎస్, యూరప్లో నిర్వహించిన పరిశోధనల్లో తేలికపాటి లక్షణాలున్న రోగుల్లో వైరల్ లోడ్ను తగ్గించిందని, ఆసుపత్రికి వెళ్లే కేసులను గణణీయంగా తగ్గించాయని పేర్కొంది.
ఇప్పటికే రోచ్ కంపెనీ తయారు చేసిన కాక్టెయిల్కు భారతదేశంలో అత్యవసర వినియోగానికి ఇటీవల డీసీజీఐ అనుమతి ఇచ్చింది. మోనోక్లోనల్ యాంటీబాడీ ఆధారిత కాక్టెయిల్ను అభివృద్ధి చేసిన ఏకైక భారతీయ సంస్థ జైడస్. SARSCoV-2 స్పైక్ ప్రోటీన్ను మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ నిర్వీర్యం చేస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా జైడస్ క్యాడిలా హెల్త్కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ మాట్లాడుతూ ఈ సమయంలో వైరస్పై పోరాడేందుకు సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్సలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్ రోగుల బాధను తగ్గించే సామర్థ్యం ZRC-3308కు ఉందని నమ్మతున్నట్లు పేర్కొన్నారు.