హైదరాబాద్ : తెలంగాణ నవనిర్మాతలైన ఇంజినీరింగ్ విద్యార్థులను ( Engineering Students ) ‘ క్రిమినల్ వేస్ట్’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) వ్యాఖ్యనించడాన్ని బీఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్షం ఉపనాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy ) తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి తెలంగాణ విద్యార్థి లోకానికి బహిరంగంగా భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్ విద్యార్థులపై నోరుపారేసుకోవడం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. భావి భారత నవనిర్మాతలను అభినందించాల్సింది పోయి, ఇష్టారాజ్యంగా అభాండాలు వేయడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి పరిపాటిగా మారిందని ఆరోపించారు.
తన పాలనా వైఫల్యాన్ని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి పవిత్రమైన విద్యావ్యవస్థపై బురద జల్లుతూ విద్యార్థులపై ‘ క్రిమినల్స్ ’అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ప్రపంచస్థాయి జ్ఞానులను, శాస్త్రవేత్తలను అందించిన తెలంగాణ గడ్డపై చదువు కుంటున్న విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసే హక్కు ఏ పాలకుడికీ లేదని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.