BRICS Summit : బ్రిక్స్ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన విషయంలో చివరిదాకా ఉత్కంఠ కొనసాగింది. శుక్రవారమే ఆయన పర్యటనను చైనా ఖరారు చేసింది. అసలే ఇండియా-చైనా మధ్య విబేధాలు.. గాల్వాన్ ఘటన అనంతరం తొలిసారి.. అది కూడా ఏడేళ్ల తర్వాత జిన్పింగ్ ఇండియా వస్తుండటంతో ఆ దేశం కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. చైనాకు చెందిన భద్రత విభాగం ఇండియాలో మన భద్రతా విభాగంతో సమన్వయం చేస్తూఆయన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.
ఆయన ఇండియాలో ఉండేది 24 గంటలు మాత్రమే. అయినప్పటికీ కనీవినీ ఎరుగని భద్రత కొనసాగుతోంది. అనేక భద్రతా సంస్థలు ఇందుకోసం పని చేస్తున్నాయి. జిన్ పింగ్ పర్యటించబోయే ప్రాంతం, ఆయన బస చేసిన హోటల్ వంటివన్నీ నో ఫ్లై జోన్లుగా ఉన్నాయి. యాంటీ టెర్రర్, బాంబ్ డిటెక్షన్ టీంలు పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జిన్పింగ్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో బస చేస్తున్నారు. ఈ హోటల్ రూంలు అన్నీ భద్రతా దళాల అధీనంలో ఉన్నాయి.
హోటల్పై అణు దాడులు, బయో కెమికల్ దాడులు, రేడియేషన్ వంటివన్నీ తనిఖీ చేశారు. చివరకు ఈ హోటల్ కింద ఉన్న అండర్గ్రౌండ్ పైప్లైన్లను కూడా తనిఖీ చేశారు. జిన్పింగ్కు భద్రత కల్పించే అధునాతన, రక్షణ వాహనమైన లిమౌజిన్ అనే కారు పది రోజుల క్రితమే ఇండియా చేరుకుంది. ఎయిర్ చైనాకు చెందిన హై సెక్యూరిటీ బోయింగ్ 747-8 అనే విమానంలో జిన్పింగ్ ఇండియా చేరుకున్నారు. జిన్పింగ్ రక్షణ కోసం చైనా నుంచి భద్రతా సిబ్బంది వచ్చారు. అలాగే, కొన్ని అధునాతన సామగ్రిని కూడా ఇండియాకు తీసుకొచ్చారు. మన దేశ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం వాటికి అనుమతించింది.
అయితే, శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ను మాత్రం అనుమతించలేదు. జిన్పింగ్ ఆదివారం ఉదయం 11.00 గంటలకు ఇండియా నుంచి బయల్దేరుతారు. బ్రిక్స్ సదస్సు కోసం ప్రభుత్వం 15,000 మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తోంది. ఎక్కడికక్కడ బారికేడ్లతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.