West Bengal : విద్యార్థులు మొబైల్ ఫోన్లు కొనుక్కునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయబోతున్నట్లు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బెంగాల్ సీఎం సువేందు అధికారి దీనిపై ప్రకటన చేశారు. ఈ పథకాన్ని రద్దు చేయబోతున్నట్లు శనివారం ప్రకటించారు. బీజేపీకి ముందు బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ తరుణేర్ స్వప్నో అనే పథకాన్ని 2022లో ప్రవేశపెట్టింది.
దీని ప్రకారం రాష్ట్రంలో 11, 12 తరగతులు (ఇంటర్) చదివే విద్యార్థులు మొబైల్ ఫోన్లు కొనుక్కునేందుకు ఏకమొత్తం ఆర్థిక సాయం అందించేవారు. ఫోన్లు కొనుక్కోవడానికి రూ.10,000 అందించేవారు. ఇప్పటిదాకా టీఎంసీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించింది. ఈ పథకాన్ని రద్దు చేయబోతున్నట్లు సీఎం సువేందు అధికారి తెలిపారు. తమ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించబోదని.. దాని బదులు విద్యార్థులకు మరిన్ని మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం సువేందు అధికారి మాట్లాడారు. గుజరాత్లోని స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు మొబైల్ ఫోన్లు తీసుకు వెళ్లడాన్ని నిషేధించారని గుర్తు చేశారు.
విద్యార్థులు మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచడం వల్లే చదువుపై ఏకాగ్రతతో ఉంటారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మొబైల్స్ అందిస్తే.. విద్యార్థులు ఫోన్లను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు రాత్రి త్వరగా నిద్రపోయినా.. విద్యార్థులు మాత్రం రాత్రిపూట మొబైల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారని సీఎం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మొబైల్ ఫోన్ల పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.