Hafiz Saeed : అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఎన్ఐఏ కోర్టు శనివారం ఈ వారెంట్ జారీ చేసింది. పాకిస్తాన్కు చెందిన హఫీజ్ సయీద్.. లష్కర్ ఎ తయిబా తీవ్రవాద సంస్థను స్తాపించాడు. ఇండియాలో అనేక పేలుళ్లకు కారకుడు. 2001లో పార్లమెంట్పై దాడి, ముంబై ఉగ్రదాడి, పుల్వామా దాడి సహా పలు ఉగ్రదాడులకు కీలక సూత్రధారి. అలాగే, ఇండియాలో ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి నేరాలకు పాల్పడ్డాడు.
అమెరికా.. హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల అతడిపై ఎన్ఐఏ కొత్తగా పలు అభియోగాలు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మొహమ్మద్ నకీబ్ భట్ అనే ఉగ్రవాదిని ఎన్ఐఏ శ్రీనగర్లో అరెస్టు చేసింది. చైనా మేడ్ గ్రెనైడ్ సహా అనేక ఆయుధాల్ని అతడి నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా అతడి విచారణ సందర్భంగా హఫీజ్ సయీద్ పాత్రపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. పాకిస్తాన్ కేంద్రంగా హఫీజ్ ఇండియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇండియాలో లష్కర్ ఎ తొయిబా నెట్వర్క్ నడుపుతున్నాడు.
అరెస్టైన నకీబ్ భట్ సహా పలువురు ఉగ్రవాదుల్ని అతడే తయారు చేస్తున్నాడు. అతడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాడని, తప్పించుకు తిరుగుతున్నాడని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ఎన్ఐఏ.. కోర్టుకు సమర్పించింది. దీంతో హఫీజ్ సయీద్పై ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హఫీజ్ సయీద్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం రెండు నెలల్లో ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా ఇదే కోర్టు వారెంట్ జారీ చేసింది. గత జూలై 8న ఈ ఆదేశాలిచ్చింది.