Chhattisgarh : చిన్నారి బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ మేరకు కోర్టు తాజాగా శిక్ష ఖరారు చేసింది. బాలికపై అత్యాచారానికి పాల్పడింది ఆమె మేనమామే కావడం గమనార్హం. చత్తీస్గడ్లోని దుర్గ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. దుర్గ్ జిల్లాలోని ఓం నగర్ ఉర్లా ప్రాంతంలో గత ఏడాది ఏప్రిల్లో ఈ ఘటన జరిగింది. ఆరేళ్ల ఒక చిన్నారి స్థానిక ఫెస్టివల్ సందర్భంగా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది.
అయితే, సాయంత్రం చీకటైన తర్వాత కూడా ఆ చిన్నారి వాళ్ల ఇంటికి వెళ్లలేదు. దీంతో బాలిక కుటుంబం చుట్టుపక్కలా వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో మోహన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాలిక కోసం గాలిస్తుండగా.. దగ్గర్లోని ఒక కారు ఢిక్కీలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. అప్పటికే ఒంటిపై కొన్ని గీతలున్నాయి. పెదవుల నుంచి రక్తస్రావం జరిగింది. దీంతో పోలీసులు చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. అత్యాచారం చేసి, హత్య చేసినట్లు తేలింది.
ఇదే సమయంలో ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో చిన్నారి మర్మాంగాలపై టాయిలెట్ క్లీనర్ పోసినట్లు కూడా వెల్లడైంది. ఈ అంశంపై పోలీసులు విచారణ జరపగా.. చిన్నారి మేనమామ సోమేష్ యాదవ్ ఈ హత్యాచారానికి పాల్పడ్డట్లు తేలింది. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. పోలీసులు నిందితుడైన మేనమామను అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరిపేందుకు దుర్గ్ జిల్లా కేంద్రంలో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. 17 నెలల్లోనే ఈ కేసు విచారణ పూర్తైంది. ఈ కేసును అత్యంత అరుదైన ఘటనగా భావించిన కోర్టు.. నిందితుడికి మరణశిక్ష విధించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి అనిష్ దూబే.. ఈ మేరకు తీర్పు వెల్లడించారు.