డెహ్రాడూన్ : బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో గంగానది, యమునా నదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన ఘటన మరిచిపోక ముందే మరోసారి ఉత్తరాఖండ్లోని ఓ నదిలో మృతదేహాలు కలకలం సృష్టించాయి. పిథోర్గఢ్ జిల్లాలోని సరయూ నదిలో డజన్ల కొద్దీ మృతదేహాలు తేలుతూ కనిపించాయి. మృతదేహాలు కరోనా మృతులవేనంటూ స్థానికంగా ఆందోళనకు గురవుతున్నారు. మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి 30 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉంది.
తాగునీటి సరఫరా కోసం ఈ నది నీటినే వినియోగిస్తుంటారు. ఈ నీరు కలుషితం కావడంతో కరోనా వ్యాప్తి చెందుతుందని స్థానికులు భయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా పరిధిలో కరోనా కేసులు భారీగానే ఉన్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ పంకజ్ చందోలా మాట్లాడుతూ.. సరయూ నదిలో కనిపించిన మృతదేహాలు పిథోర్గఢ్కు చెందినవి కాదని స్పష్టం చేశారు. మృతదేహాలను ఇంకా గుర్తించలేదని, ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.