న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మరోసారి మూడు లక్షలకు దిగువన కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు 4వేలకుపైగా రికార్డవగా.. తాజాగా నాలుగువేలకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 2,11,298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2,83,135 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. వైరస్ బారినపడి కొత్తగా 3,847 మంది ప్రాణాలు వదిలారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 పెరగ్గా.. మొత్తం 2,46,33,951 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్ బారినపడి 3,15,235 మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 24,19,907 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్లో 20,26,95,874 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 90.01శాతానికి పెరిగిందని, వ్లీకీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 10.93శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 9.79శాతంగా ఉందని తెలిపింది. వరుసగా మూడు రోజుల్లో రోజువారీ పాజిటివిటీ రేటు పదిశాతాని కన్నా తక్కువగా నమోదైందని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 21,57,857 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 33,69,69,352 నమూనాలను టెస్ట్ చేసినట్లు చెప్పింది.