తిరుమల : హనుమాన్ జన్మస్థలంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నది. తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెబుతుండగా.. కాదు కిష్కిందే మారుతి జన్మస్థలమని తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీతో తీర్థ క్షేత్ర ట్రస్ట్ చర్చకు సిద్ధమైంది. అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానం అంటూ శ్రీరామనవమి పర్వదినం రోజు టీటీడీ చేసిన ప్రకటనను ఖండిస్తూ పలుసార్లు లేఖ రాసిన కిష్కింద ట్రస్ట్ చర్చలకు ముందుకు వచ్చింది. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత పీఠాన్ని ఇరు వర్గాలు సంవాదానికి వేదికగా నిర్ణయించారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన శ్రీ హనుమద్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ శ్రీ గోవిందానంద సరస్వతీ.. టీటీడీ కమిటీని చర్చకు రావాలని ఆహ్వానించారు. ఈ చర్చ ద్వారా పంపా క్షేత్ర కిష్కింధే మారుతీ జన్మస్థలంగా నిరూపించాలని జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు టీటీడీకి సమాచారం ఇచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు ఇరువర్గాలు చర్చలను ప్రారంభించాయి. కిష్కింధ ట్రస్ట్ తరఫున గోవిందానంద సరస్వతీ, టీటీడీ తరఫున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొంటున్నారు. చర్చల పూర్తయిన అనంతరం వివరాలను మీడియాకు వివరించే అవకాశం ఉన్నది.