వేటగాళ్ల వాగ్దానాలు, వంచకుల వలలు ఎప్పటిలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వంచితుల చుట్టూ మోహరించాయి. సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్రలో వివక్షను దేశం నలుమూలలా వనంలా పెంచి పోషించిన రెండు జాతీయ పార్టీల అగ్రనేతలే.. న్యాయం, నమ్మకం అంటూ మళ్లీ మాయ చేయడానికి కుయుక్తుల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పూలే జీవించి ఉంటే, అంబేద్కర్ మన మధ్యలో ఉండి ఉంటే.. కమలం, హస్తం పార్టీలు తెలంగాణతో పాటు దేశంలో చేస్తున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై పిడుగుల వర్షం కురిపించేవారు.
నయవంచకులే న్యాయ సూత్రాలు వల్లిస్తుంటే, బడుగులు అడుగు ముందుకేయకుండా అడ్డుగోడలు నిర్మించిన పక్షపాతులే ప్రజాస్వామ్యంపై ప్రవచనాలు ఊదరగొడుతుంటే వెయ్యి పీనుగలు తిన్న రాబందు.. శాకాహార ప్రయోజనాలను ప్రచారం చేసినట్టుగా ఉండదా? ఇప్పుడు రాహుల్గాంధీ, మోదీ ప్రదర్శిస్తున్న ఎన్నికల విన్యాసాలు అలాగే ఉన్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే.. ఊసరవెల్లి కూడా ఉరివేసుకునేలా సీఎం రేవంత్రెడ్డి సైతం జనగణన, బీసీల హక్కులు, సామాజిక న్యాయం, వాటా, కోటా అంటూ చిలుకపలుకులు పలుకుతున్నారు.
Telangana | నిజమే.. ‘వినేవాడుంటే చెప్పేవాడికి ఎప్పటికీ లోకువే’ అనే నానుడి గాలికి పుట్టలేదు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే అంబేద్కర్ ఆశయాలకు తలకొరివి పెట్టి, పూలే భావనను పూడ్చి పెట్టే పనితీరును నిత్యం కొనసాగిస్తున్నది రేవంత్రెడ్డి సర్కార్ కాదా? రాష్ట్ర మంత్రిమండలిలో, నియమిత పదవుల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సీట్లు, వాటాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే కులాలకు ఎంతెంత వడ్డించిందో అందరికీ అర్థమైపోయింది. చివరికి న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ బాధ్యతలను ఇప్పటి సీఎంలా ఒకే వర్గం వారికి గతంలో ఏ ప్రభుత్వం అప్పగించలేదు. ఇలా నాలుగు నెలల్లోనే వాటా హక్కును నడివీధిలో నవ్వుల పాలుచేసిన చర్యలు ఎన్నో? కానీ, గురివింద గింజ నైజం రేవంత్రెడ్డి సర్కార్కు, రాహుల్గాంధీ పార్టీకి కొత్తేం కాదన్నది దేశంలోని బుద్ధిజీవులందరికీ తెలిసిన సత్యమే.
ఆ కుట్రల ఒరవడిలోనే నేడు జనగణన, బీసీల వాటా, రిజర్వేషన్లు అనే సున్నితమైన, కీలకమైన సామాజిక అంశాలపై రాజకీయ పబ్బం కోసం వెంపర్లాడుతున్నది. బహుశా మన దేశంలో లాగా, విపణిలో బీజేపీ, కాంగ్రెస్ లాంటి ద్రోహ పూరిత చరిత్ర కలిగిన రాజకీయ పార్టీలు ఇంతకాలం జనాలను ఏమారుస్తూ మనుగడ సాగించడం దుస్సాధ్యమేమో. సమ్మిళిత అభివృద్ధి, శాంతి, సామాజిక న్యాయం ఇలా ఏ అంశంలోనైనా, ఎండమావుల చుట్టూ ఏండ్లకు ఏండ్లు తిప్పి ఏమారుస్తూ.. అతిపెద్ద మానవ సమూహాన్ని బంతాటలా ఆడుకోవడం ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే చెల్లుబాటు అయ్యేదా? మన ప్రజల అమాయకత్వాన్ని నినాదాలకు బానిసలుగా మలుస్తూ, పల్లకీలో ఊరేగుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, ఇంకా ఎంతకాలం అధిక జనాభాను జోకొట్టి, దేశాన్ని కొల్లగొడుతూ ఉంటాయి?
ఎకనామిక్ హిట్ మ్యాన్ అనే పుస్తకం ఆమధ్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది తెలుగులోనూ దళారీ పశ్చాత్తాపం పేరిట ప్రచురితమైంది. ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఈ పుస్తక రచయిత వర్ధమాన దేశాల సంపద ఎలా కొల్లగొట్టబడుతున్నదో అనుభవపూర్వకంగా, ఆధారాలతో రాసి ప్రపంచ పాఠకుల గుండెలు మండేలా చేశారు. అదొక పాప ప్రాయశ్చిత్త, దోపిడీ, పీడన వ్యతిరేక మానవీయ రచన. కానీ, నేడు రాహుల్ గాంధీ ప్రసంగాలు అలా కూడా ఉండటం లేదు కదా? దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అన్యాయ పాలన, పీడన, దోపిడీపై రాహుల్గాంధీ మాటల్లో ఇసుమంతైనా ప్రాయశ్చిత్తం వ్యక్తం కావడం లేదు. అసలు రిజర్వేషన్లు బీసీలకు అందకుండా దగా చేసిందే కాంగ్రెస్ అనే వాస్తవం నేడు కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ మొసలి కన్నీటితో కడుక్కోలేదు కదా? కేంద్రంలో 90 ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శులుగా బీసీలు కేవలం ముగ్గురే ఉన్నారని, న్యాయ వ్యవస్థతో పాటు అన్నింటా సగం జనాభా అయిన బడుగులు అట్టడుగునే పడి మగ్గుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత వల్లిస్తున్న ఊకదంపుడు ఉపన్యాసం వాస్తవమే. కానీ, ఈ అసమాన అన్యాయ వ్యవస్థకు బలమైన పునాదులు పేర్చిందే హస్తం పార్టీ కదా.
రిజర్వేషన్లకు పాడెను కట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే, సమాధిని నిర్మిస్తున్నది బీజేపీనే కదా? పెరియార్ పోరాట ప్రభంజనంతో గానీ బీసీల కోసం మొదటి రాజ్యాంగ సవరణ చేసేందుకు హస్తం పార్టీకి చేతులు రాలేదు. కాకా కాలేల్కర్ కమిషన్ 1953లో బీసీలకు రిజర్వేషన్లు సిఫారసు చేస్తే, ఆయన్ను ఆనాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ పార్లమెంట్ సెంట్రల్ హాల్కు పిలిపించుకొని, మందలించి, డీసెంట్ నోట్ రాయించి బీసీల భవితకు ఆదిలోనే మోకాలడ్డం పెట్టారు. తర్వాత 1993 దాకా బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా నాలుగు దశాబ్దాల పాటు బీసీల వాటాను వధించిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. మండల్ కమిషన్పై పార్లమెంట్లో చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, అవి దేశానికి ప్రమాదకరమైనవని సుదీర్ఘంగా ప్రసంగించి, బీసీల జీవితాల్లో చీకటి కుమ్మరించిందే రాజీవ్గాంధీ అనే సత్యం బుద్ధిజీవులందరికీ తెలిసిందే.
తీరా సుప్రీంకోర్టు తీర్పుతో బీసీ రిజర్వేషన్లు అమలులోకి రావడానికి రెండేండ్ల ముందే అనగా 1991లోనే ప్రపంచీకరణ విధానాల పేరిట, ప్రైవేట్ రంగానికి తలుపులు బార్లా తెరిచి బడుగుల కుండకు చిల్లులు పెట్టింది హస్తం సర్కార్ పెద్దలే కదా? ఏడున్నర దశాబ్దాలుగా జనగణనతో పాటు అనేక అంశాల్లో కాంగ్రెస్ సర్కార్ల వంచన, కమలం పార్టీ పెద్దల సమర్థింపు వల్ల వివక్షకు వేలాడిన బీసీల హక్కులు ప్రతి సందర్భంలోనూ పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డాయే కానీ వారి రొట్టె విరిగి నెయ్యిలో పడలేదు. బీసీల కాళ్లు కాంగ్రెస్ విరగ్గొడితే, నేడు బీజేపీ ఏకంగా తినే చేతులనూ తెగనరుకుతున్నది.
కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సంఖ్యను 41.76 లక్షల నుంచి 34.5 లక్షలకు కుదించడమే కాదు, 16 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ కొలువులను భర్తీ చేయకుండా బీసీ రిజర్వేషన్లను ఎగ్గొట్టింది మోదీ ప్రభుత్వం. దానికితోడు ప్రైవేటీకరణ కాదు.. కాదు.. అదానీకరణకు అంతా సమర్పిస్తూ.. అడిగేందుకు ఏమీ మిగలని దశకు దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. నిజానికి రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర కాదు, ఏనాడో వాటిపై నిషేధాజ్ఞలను రెండు జాతీయ పార్టీలు అప్రకటితంగా అమలు చేసేశాయి. ఇక రాజ్యాంగానికి తూట్లు కాదు, ఏకంగా పోట్లే పొడిచి, ప్రవేశిక లక్ష్యాల పీక నొక్కేశాయి. అలాగే 2021లో బీసీల జనగణన చేస్తామని 2018లో ఆనాటి హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చి, తర్వాత పంగనామం పెట్టేశారు. ఇలా ఎన్నో అంశాల్లో విలువల వధలో వీడు ఉక్కూ కాదు, వాడు తుక్కూ కాదని చెరబండ రాజు అన్నట్టుగా కమలం, హస్తం పార్టీలు బీసీల హక్కుల హననంలో పోటీ పడి పనిచేశాయి.
అసలు రాజ్యాంగం అర్థం కాని కాంగ్రెస్, ఇష్టమేలేని బీజేపీలూ.. ఎన్నికలను కనికట్టుగా, పరిపాలనను సర్కస్ ఫీట్లుగా మార్చేశాయి. రాజకీయాలను గుప్పెడు మంది గుత్తసొత్తుగా మార్చి, బలవంతులదే రాజ్యమనే రాతియుగ భావనను బలపరిచాయి. ఢిల్లీలో గాంధీ కుటుంబం, రాష్ర్టానికో సామాజిక వర్గం సొత్తుగా హస్తం పార్టీ.. విస్తరణకు విద్వేషం, విధానాలు కుబేరుల కోసం అంటూ కమలం పార్టీ మనుగడ సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏనాడో ప్రమాదంలో పడేశాయి.
వాస్తవానికి దేశాన్ని ఇలా వివక్షావనంలా మార్చివేసిన కుసంస్కార కాంగ్రెస్, బీజేపీ విధానాలను అభివృద్ధి చెందిన వర్గాల్లోని బుద్ధిజీవులు సైతం ఈసడించుకోకుండా ఉండలేరు. ఇంకా నయం వివక్షలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు పురుడుపోసుకోకపోయి ఉంటే నేటికీ అరాచకమే అంతటా వర్ధిల్లేది. అసలు స్వాతంత్య్ర ఉద్యమంలోని సామాజికాంశంలో నుంచే రాజ్యాంగంలోని ఆదర్శవాదం, ప్రాథమిక హక్కులు, సమ భావనలను రూపొందించారు. ఆ లోతైన దృష్టి కోణం కొరవడే గాంధీలు, మోదీ, ఆయన ముందుతరాలు వివక్ష నిర్మూలనకు నడుం బిగించలేదు. కానీ, దేశంలో ఒకటి, రెండు ప్రాంతీయ పార్టీల కంటే ఎన్నో రెట్లు బీసీల ఎదుగుదలకు దోహదపడే పాలనా విధానాలు అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం.
తొలి శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, ఆర్థిక మంత్రి, కీలకమైన పదవులతో పాటు, నియమిత పదవుల్లోనూ భాగస్వామ్యం కల్పించింది. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు, చట్టసభల సభ్యులుగా అవకాశాలతో పాటు బీసీ కులాల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం పెంచే ఎన్నో చర్యలు చేపట్టింది. కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, గురుకులాలు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, విదేశీ విద్యానిధి, ఆసరా పింఛన్ల పెంపు ఇలా ఎన్నో పథకాలను బీసీ కుటుంబాలు బలోపేతం అయ్యేందుకు అమలుచేసింది. సంక్షేమ పథకాలే కాదు, బీసీల దీర్ఘకాలిక డిమాండ్లు అయిన చట్టసభలలో రిజర్వేషన్లు, బీసీ మంత్రిత్వ శాఖ, జనగణన వంటి వాటిపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర సర్కార్కు పంపింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగిస్తున్నది.
ఇంకా భవిష్యత్తులో పెండింగ్లో ఉన్న బీసీల డిమాండ్ల కోసం అండగా నిలబడి పోరాడే శక్తి, ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకే ఉంది. చారిత్రక దోషి కాం గ్రెస్, బీసీలకు ఉరి వేసే బీజేపీ వలలో బడుగులు పడితే.. మళ్లీ మోసపోవడమే తప్ప ఒరిగేదేం ఉండదు. బీసీలకు ప్రాం తీయ పార్టీలే బలం, బలగం. దశాబ్దాలుగా జాతీయ పార్టీల ప్రయోజనాలు, లక్ష్యాలు.. బీసీల హక్కులతో చేతులు కలుపనేలేదు, ఇకపై కూడా కలుపలేవు. చరిత్రలో గోముఖ వ్యాఘ్రాలుగా తేలిపోయిన హస్తం, కమలం పార్టీలను బీసీ కులాలు ఊరవతలే నిలువరించాల్సిన కీలక సందర్భమిది. ఈ రెండు పార్టీలు నిజంగా బీసీల మీద మనసుపెట్టి ఉంటే వ్యాపారవేత్తలుగా మారి దేశ జీడీపీకి జోడెద్దులుగా బీసీలు మారేవాళ్లు. చైనా వస్తూత్పత్తి విపణి మార్కెట్ను చేజిక్కించుకున్నట్టుగా.. భారతీయ బీసీ కులవృత్తుల ఉత్పత్తులు ప్రపంచ ఎకానమీలో వాటాను రాబట్టుకునేవి. ఆ రెండు పార్టీలు చేసిన మోసం.. బీసీల మెడకు దరిద్రాన్ని వేలాడదీసింది.
అందువల్లే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 101వ స్థానం, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 126వ స్థానం దక్కించుకొని కుమిలిపోతున్నాం. హక్కు ల మాట దేవుడెరుగు అన్నమూ.. ఆనందమూ కరువైన బతుకుల భారతానికి ఈ బుద్ధిమాంద్య బీజేపీ, కాంగ్రెస్ కారణం కాదా? ఇంకా వారి నినాదాలకు లొంగిపోదామా? 45 లక్షల కోట్ల దేశ బడ్జెట్లో బీసీలకు పిడికెడంత పెట్టడానికి మనసురాని మాయదారి పార్టీలు మనకెందుకు? వారి సంతకాల పెన్నులు, విధించే పన్నులు బడుగులకు భారమే కానీ, ఆదెరువుగా మారనేమారవు. మంచి రోజులు రావాలంటే మనమూ మారాలి. గాంధీ, మోదీలతో బీసీలకు ముప్పే తప్ప, మరేం ప్రయోజనం ఒనగూడదు. ఇదే చారిత్రక సత్యం.
సంకీర్ణ కూటమి సర్కార్లతోనే బీసీల హక్కులు సాధ్యమని చరి త్ర చెప్తున్నది. ఆ దిశలో ఢీల్లీ మెడలు వంచే సామర్థ్యమున్న కేసీఆర్ నాయకత్వాన్ని బీసీలు బలపరచాలి. ఎంపీ ఎన్నికల్లో అత్యధికంగా ఆరు సీట్లను బీఆర్ఎస్ పార్టీ బీసీలకు కేటాయించింది. ఆ ఆరుగురు అభ్యర్థులతో పాటు బీసీల భవిష్యత్తు కోసం నిలబడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ మనం గెలిపించుకోవాలి. లేకపోతే రానురాను ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందుకే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు తమ సత్తా చాటాలి. విజ్ఞతను, ఐక్యతను ప్రదర్శించాలి.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్