Homes Market | తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇండ్ల స్థలాలు, ఇండ్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. 2023తో పోలిస్తే 2024 జనవరి- ఏప్రిల్ మధ్య హైదరాబాద్ లో రూ.26,027 కోట్ల విలువైన ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది కేవలం రూ.16,190 కోట్ల విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. గతేడాది విక్రయాలు, ఇండ్ల ధరలతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతం పెరిగింది. ఇంతకుముందుతో పోలిస్తే.. ప్రస్తుతం హైదరాబాదీలు లగ్జరీ ఇండ్ల రిజిస్ట్రేషన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ప్రత్యేకించి రూ.కోటి, అంతకంటే ఎక్కువ ధర గల ఇండ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. 2023 జనవరి- ఏప్రిల్ తో పోలిస్తే గత నాలుగు నెలల్లో లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లు 96 శాతం పుంజుకున్నాయి.
ఇక రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య విలువ గల మిడ్ సైజ్ ఇండ్ల కొనుగోళ్లు 47 శాతం పుంజుకున్నాయి. ఓవరాల్గా హైదరాబాద్ నగర పరిధిలో అన్ని సెగ్మెంట్ల ఇండ్ల కొనుగోళ్లు పుంజుకోగా, భాగ్యనగర వాసులు మరింత లగ్జరీ ఇండ్లపై మోజు పెంచుకుంటున్నారని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇండ్ల కొనుగోళ్లలో కొనుగోలుదారుల డిమాండ్లు మారిపోతున్నాయని నైట్ ఫ్రాంక్ సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ వాసులు.. స్పేసియస్, ప్రీమియం వసతులు గల లగ్జరీ ఇండ్ల వైపు మొగ్గుతున్నారన్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఇండ్ల ధరలు నికరంగా పెరుగుతున్నాయని అన్నారు.