రాష్ట్ర విభజన జరిగితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు రాష్ర్టాలుగా విడిపోయాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లో ప్రశాంతంగా జరిగాయి. ప్రస్తుతం ఏపీలో పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ జరిగిన అల్లర్లతో శాంతిభద్రతలు క్షీణించిపోవడంతో ప్రాణభయంతో కొందరు నాయకులు హైదరాబాద్లో తలదాచుకున్నట్టు వినికిడి. మరి తెలంగాణ ఏర్పడితే శాంతిభద్రతలు క్షీణిస్తాయని అప్పట్లో అన్నారు కదా? అని అడిగితే ‘శాంతిభద్రతలు క్షీణిస్తాయని అన్నమాట నిజమే కానీ అది మీ దగ్గర కాదు, మా దగ్గర’ అని బుకాయిస్తారేమో!
డామిట్ కథ అడ్డం తిరిగింది..
ఎన్నికల బడలికతో కాస్త రిలాక్స్ అవుదామనుకున్నారో లేక మరేదైనా పనిమీద బయలుదేరారో కానీ, విమానానికి సాంకేతిక సమస్య తలెత్తడంతో ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు అడ్డంగా బుక్కయ్యారు. ఆ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో పాటు విమానంలో వెళ్తున్న వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వారు విశ్రాంతి కోసమే వెళ్తున్నారా? లేక క్యాంప్ రాజకీయాలకు వెళ్తున్నారా? అన్న అనుమానాలు రేకెత్తాయి. ఎందుకొచ్చిన గొడవని అనుకున్నారేమో, తెల్లారేసరికి వారంతా హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. మంత్రి పొంగులేటి ఏకంగా సీఎం సమీక్షా సమావేశంలో కనిపించేసరికి, ‘అయ్యో మీరు టూర్కు వెళ్లలేదా?’ అని కనిపించినవారంతా ఆశ్చర్యంగా ప్రశ్నిస్తే.. ‘ఇంకెక్కడి టూర్’ అని ఆయన వాపోయారట.
ఇదీ సంగతి
పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయం లోపించడం వల్ల చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలలో పరిస్థితి ఆశాజనకంగా ఉండకపోవచ్చని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇంతకు ఈ కమిటీ పరోక్షంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. ఈ మూడు సీట్లకు నీళ్లు వదులుకోక తప్పదని. ‘కమిటీలో ఉన్నదే ఐదుగురు. ఎక్కడికి వెళ్లి సర్వే చేసి ఆ విధంగా నివేదిక ఇచ్చారు’ అని ఓ అభ్యర్థి ఫోన్ చేసి మండిపడినట్టు కమిటీ సభ్యుడొకరు గాంధీభవన్లో వాపోయారు.
ఎంత ప్రేమో!
పార్లమెంట్ ఎన్నికల్లో తమకు 12 సీట్లు వస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ అంటే, తమకు 13 సీట్లు వస్తాయని కాంగ్రెస్ చెప్పింది. మొత్తం 17 సీట్లకు గానూ అన్ని పార్టీలు ఎంఐఎంకు ఒక సీటు వదిలేసి మిగతా 16 స్థానాలనే లెక్కలోకి తీసుకొని తమకు 12 లేదా 13 సీట్లు వస్తాయని చెప్తున్నాయి. మరి మిగతా మూడు లేక నాలుగు సీట్లలో ఏ పార్టీ గెలుస్తుందో మాత్రం చెప్పడం లేదు. అంటే ప్రత్యర్థి పార్టీకి కూడా ఓ రెండో, మూడో సీట్లు వదలకపోతే ఎలా అని జాలి చూపిస్తున్నాయన్న మాట.
– వెల్జాల